కేంద్ర హోం మంత్రి అమిత్ షా పిలుపు
న్యూఢిల్లీ: దేశంలోని ప్రాంతీయ భాషలన్నిటికీ హిందీ మిత్ర భాష అని, అన్ని భాషలను ప్రోత్సహించాల్సిందేనని కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలిపారు. హిందీ దివస్ సందర్భంగా మంగళవారం నాడిక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ ఇతర ప్రాంతీయ భాషలకు, హిందీకి ఎటువంటి తేడా లేదని, నిజానికి హిదీ అన్ని భారతీయ ప్రాంతీయ భాషలకు సఖి(మిత్రురాలు) వంటిదని ఆయన అభిప్రాయపడ్డారు. తమ పిల్లలు ఇంగీషు మాధ్యమంలో చదువుతున్నప్పటికీ తల్లిదండ్రులు మాత్రం తమ పిల్లలతో ఇంట్లో మాతృభాషలోనే మాట్లాడాలని ఆయన పిలుపునిచ్చారు.
అన్ని ప్రాంతీయ భాషలు హిందీని గౌరవిస్తాయని, అదే విధంగా అన్ని ప్రాంతీయ భాషలను ప్రోత్సహించడంతోపాటు వాటి పురోగామికి కృషి చేయాలని ఆయన అన్నారు. 2014 నుచంఇ ఎక్కువ మంది ఎంపీలు పార్లమెంట్లో తమ ప్రాతీయ భాషలోనే మాట్లాడుతున్నారని, వీటిని ఇంగ్లీషు, హిందీలోకి అనువదించడం జరుగుతోందని అమిత్ షా తెలిపారు. తమ ప్రాంతాలలో నెలకొన్న సమస్యలను ప్రస్తావించవలసిందిగా ఎంపీలను తాను కోరుతున్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ప్రజలు కేవలం వస్తు ఉత్పాదకలోనే కాక భాషల కోసం ఆత్మ నిర్భర్(స్వయం సమృద్ధి) సాధించాలని ఆయన పిలుపు ఇచ్చారు. తన ఆలోచనలను తెలియచేసేందుకు ప్రధాని నరేంద్ర మోడీ అన్ని అంతర్జాతీయ వేదికలపై కేవలం హిందీలోనే ప్రసంగిస్తారని ఆయన గుర్తు చేశారు. హిందీ మాట్లాడేందుకు జంకడం అన్నది ఒకప్పటి మాటని ఆయన వ్యాఖ్యానించారు.