న్యూఢిల్లీ: భారతీయ టెలికాం రంగంలో పెట్టుబడులు వెల్లువెత్తున్నాయి. గత రెండు నెలల్లో రిలయన్స్ జియోలోకి రూ.70 వేల కోట్లకు పైగా విదేశీ పెట్టుబడులు వచ్చాయి. తాజాగా ఎయిర్టెల్లో కూడా అమెజాన్ భారీగా పెట్టుబడులు పెట్టనుందనే వార్తలు వెలువడుతున్నాయి. వార్తా సంస్థ రాయిటర్స్ నివేదిక ప్రకారం, అమెరికా ఇకామర్స్ దిగ్గజం అమెజాన్ భారతీ ఎయిర్టెల్లో రెండు బిలియన్ డాలర్లు పెట్టుబడులు పెట్టనుంది. అంటే ఎయిర్టెల్లో సుమారు 15,109 కోట్లు పెట్టుబడి పెట్టాలని అమెజాన్ యోచిస్తోంది. ఈ పెట్టుబడి జరిగితే అమెజాన్కు ఎయిర్టెల్లో 5 శాతం వాటా లభిస్తుంది.
300 మిలియన్లకు పైగా వినియోగదారులను కలిగి ఉన్న దేశంలో మూడో అతిపెద్ద టెలికాం సంస్థ ఎయిర్టెల్. భారతి ఎయిర్టెల్, అమెజాన్ మధ్య ఒప్పందం ప్రస్తుతం ప్రారంభ దశలో ఉంది. ఇది రాబోయే కాలంలో కూడా మారవచ్చు. దీనిపై రెండు సంస్థలు స్పందించడానికి నిరాకరించాయి. అంతకుముందు వోడాఫోన్ ఐడియా, గూగుల్ మధ్య ఒప్పందం గురించి కూడా నివేదికలు వచ్చాయి. అయితే తరువాత సంస్థ వారి మధ్య అలాంటి ఒప్పందమేమీ జరగలేదని వివరణ ఇచ్చింది. కాగా కరోనా వైరస్ మహమ్మారి విజృంభించడంతో ప్రపంచం మొత్తం చైనా వైఖరి పట్ల అసంతృప్తితో ఉన్నాయి.
చాలా పెద్ద కంపెనీలు తమ తయారీ కర్మాగారాలను చైనా నుండి వేరే దేశానికి మార్చాలని భావిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చాలా కాలంగా కరోనా విషయంలో చైనాపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే చైనాపై ఆయన చాలా ఆరోపణలు చేశారు. ప్రపంచంలోని అనేక దేశాలు కోవిడ్19 వ్యాప్తి కారణంగా చైనాకు వ్యతిరేకంగా మారాయి. చైనా పట్ల వ్యతిరేకతను భారత్ అనుకూలంగా మార్చుకోవాలని భావిస్తోంది. రాబోయే కాలంలో భారతదేశం డిజిటల్ హబ్గా మారే అవకాశముంది.