Friday, April 26, 2024

ఆవిష్కరణకు సిద్దమవుతున్న అంబేద్కర్ విగ్రహం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సమున్నత శిఖరం తెలంగాణ రాజధాని హైదరాబాద్ నడిబొడ్డున కొలువు దీరనుంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ స్మృతివనం పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ట్యాంక్‌బండ్‌పై బుద్దపూర్ణిమ ప్రాజెక్టు పరిధిలో 36 ఎకరాల్లో ఈ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతోంది. ఇందులో 2 ఎకరాల విస్తీర్ణంలో అత్యద్భుతంగా కొనసాగుతున్న బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహ నిర్మాణ పనులు చివరి అంకానికి చేరుకున్నాయి. ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు ఎస్‌సి అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఎప్పటికప్పుడు పనులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.

425 మంది సిబ్బంది రేయింబవళ్ళు నిర్మాణ పనుల్లో నిమగ్నం అయ్యారని మంత్రి కొప్పుల ఈశ్వర్ చెప్పారు. బుధవారం ఆయన విగ్రహ నిర్మాణ పనులను పరిశీలించారు. ప్రధాన విగ్రహంతో పాటు అక్కడ నిర్మిస్తున్న రాక్ గార్డెన్, ల్యాండ్ స్కేపింగ్, ప్లాంటేషన్, మెయిన్ ఎంట్రన్స్, వాటర్ ఫౌంటేన్, సాండ్ స్టోన్ వర్క్, జిఆర్‌సి, గ్రానైట్ ఫ్లోరింగ్, లిఫ్ట్, విగ్రహం వద్దకు చేరుకునే మెట్ల దారి, ర్యాంప్, బిల్డింగ్ లోపల ఆడియో విజువల్ రూమ్, ఫాల్స్ సీలింగ్ తదితర పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులు, వర్క్ ఏజెన్సీతో సమావేశమై పనుల పురోగతిపై చర్చించారు.

125 అడుగుల ఎత్తుతో దేశంలోనే ఎత్తైన అంబేద్కర్ విగ్రహంగా తెలంగాణకే మణిహారంగా నిలుస్తుందని మంత్రి చెప్పారు. విగ్రహ నిర్మాణం కోసం 791 టన్నుల స్టీల్, 96 మెట్రిక్ టన్నుల ఇత్తడిని ఉపయోగిస్తున్నట్లు మరోసారి స్పష్టం చేశారు. అంబేద్కర్ జయంతి రోజైన ఏప్రిల్ 14న ప్రారంభించాలని ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్ణయించారని, ఏప్పిల్ 10 కల్లా నిర్మాణ పనులన్నీ పూర్తి చేసే లక్షంతో సిబ్బంది పనిచేస్తున్నారని వెల్లడించారు. విగ్రహం ఆవిష్కరణపై ఎలాంటి అపోహలు వద్దని మంత్రి కొప్పుల చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News