ఉద్విగ్న పరిస్థితుల మధ్య కొడుకును అక్కున చేర్చుకున్న తల్లిదండ్రులు
న్యూయార్క్: ఆరు నెలల నిర్బంధం అనంతరం అమెరికాకు చెందిన ఓ జర్నలిస్ట్ను మయన్మార్ సైనిక ప్రభుత్వం విడుదల చేసింది. డ్యానీ ఫెన్స్టర్(37) అనే ఆ జర్నలిస్ట్ మంగళవారం న్యూయార్క్ చేరుకున్న సందర్భంగా ఆయన కుటుంబసభ్యులు ఉద్వేగానికి లోనయ్యారు. కొడుకు రాకకోసం ఫెన్స్టర్ తల్లిదండ్రులు ఎయిర్పోర్టు లాబీకి ముందుగానే చేరుకొని వేచి చూశారు. కొడుకును చూడగానే ఆయన తల్లి రోజ్ ఆనందభాష్పాలు రాలుస్తూ బిగి కౌగిలిలోకి తీసుకున్నారు. ఫెన్స్టర్ భార్య జూలియానా ఇంకా మయన్మార్లోనే ఉన్నారు. ఆమె త్వరలోనే డెట్రాయిట్లోని భర్త దగ్గరికి రానున్నారు. ఫెన్స్టర్ విడుదలకు మయన్మార్ సైనిక అధికారులను ఒప్పించడంలో మాజీ దౌత్యవేత్త బిల్రిచర్డ్సన్ కీలకపాత్ర పోషించారు. వారం రోజుల క్రితమే ఫెన్స్టర్కు సైనిక ప్రభుత్వం 11 ఏళ్ల కఠిన శిక్షను విధించింది.
ఈ నేపథ్యంలోనూ ఆయన విడుదలకు రిచర్డ్సన్ చేసిన దౌత్యం ఫలించడం గమనార్హం. ఫ్రాంటైర్ మయన్మార్ పేరుతో ఆన్లైన్ మేగజైన్ను నడుపుతూ ఫెన్స్టర్ సైనిక ప్రభుత్వం ఆగ్రహానికి గురయ్యారు. ఆందోళనకారులకు అనుకూలంగా ఆయన పత్రిక పని చేస్తున్నదని, రెచ్చగొట్టే వార్తా కథనాలను ఇస్తున్నదని ప్రభుత్వం అభియోగాలు మోపింది. మరో 100మందికిపైగా జర్నలిస్టులు మయన్మార్ జైళ్లలో మగ్గుతున్నట్టు అంచనా. ఈ ఏడాది ఫిబ్రవరిలో సైనిక ప్రభుత్వం అధికారం చేపట్టింది. అందుకు నిరసనగా జరిగిన ఆందోళనలను అణచివేయడం కోసం భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో 1200మందికిపైగా చనిపోగా, 10,000మంది అరెస్టయ్యారని అసిస్టెన్స్ అసోసియేషన్ ఫర్ ప్రిజనర్స్ చెబుతోంది.