న్యూఢిల్లీ: ఢిల్లీలో మంగళవారం రైతులు చేస్తున్న ఆందోళనలతో ఉద్రిత్త పరిస్థితులు నెలకొన్నాయి. రైతుల ట్రాక్టర్ల ర్యాలీపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా రంగంలోకి దిగారు. ఈ పరిణామాల నేపథ్యంలో హోంశాఖ అత్యవసర సమావేశం నిర్వహిస్తోంది. ఢిల్లీలో నెలకొన్న తాజా పరిస్థితులపై అధికారులతో అమిత్ షా చర్చించారు. ఉదయం నుంచి జరిగిన పరిణామాలను అధికారులు ఆయనకు వివరించారు. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని అమిత్ షా సూచించారు. రైతుల ఆందోళనల నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా పార్లమెంట్, విజయ్ చౌక్, రాజ్ పథ్, ఇండియా గేట్ వైపు వెళ్లే మార్గాలను పోలీసులు మూసివేశారు. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. రాత్రి 12గంటల వరకు ఇంటర్నెట్ సేవలు నిలిపివేస్తున్నట్టు కేంద్ర ప్రకటించింది. శాంతిభద్రతల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్రం వెల్లడించింది. అంతేకాకుండా రైతుల ఆందోళన కారణంగా మెట్రో సేవలకు కూడా అంతరాయం ఏర్పడింది. మెట్రో సేవల్లో అధికారులు పలు మార్పులు చేసినట్టు సమాచారం. పలు ప్రాంతాల్లోని మెట్రో స్టేషన్లు అధికారులు మూసివేశారు. ఢిల్లీలోని ఐటిఒ వద్ద ఓ రైతు చనిపోయాడు. పోలీసుల కాల్పుల వల్లనే బుల్లెట్ తగిలి సదరు రైతు చనిపోయాడని తోటి రైతులు చెబుతుండగా, ఆ రైతు ట్రాక్టర్ పైనుంచి పడి చనిపోయాడని పోలీసులు చెబుతున్నారు. మృతి చెందిన రైతు ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని బాజ్పూర్ జిల్లాకు చెందిన నవనీత్ సింగ్గా గుర్తించినట్టు పోలీసులు తెలిపారు.
Amit Shah Holds Meeting To Discuss Farmer Protests