Friday, April 26, 2024

లక్ష మందితో ఖమ్మంలో అమిత్ షా సభ

- Advertisement -
- Advertisement -

ఖమ్మం : ఈనెల 15న కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఖమ్మం వస్తున్న నేపథ్యంలో కనీవినీ ఎరగని రీతిలో లక్ష మంది తో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ తెలిపారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు గరికపాటి మోహన్ రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్ కుమార్, జిల్లా అధ్యక్షులు గల్లా సత్యనారాయణ, కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొండపల్లి శ్రీధర్ రెడ్డి తదితరులతో కలిసి శుక్రవారం సాయంత్రం స్థానిక సర్దార్ పటేల్ గ్రౌండ్ తోపాటు ఆ పక్కనే ఉన్న ఎస్‌ఆర్ అండ్ బీజీఎన్నార్ మైదానాలను పరిశీలించారు.

తొలుత పటేల్ గ్రౌండ్ లో సభ నిర్వహిస్తున్నట్లు చెప్పినప్పటికీ ఆ తరువాత బీజీఎన్నార్ మైదానం పరిశీలించాక ఆ మైదానంలోనే సభ నిర్వహించేందుకు మొగ్గు చూపారు. అమిత్ షా మొదటిసారి ఖమ్మం వస్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున జనం తరలివచ్చే అవకాశం ఉందని భావిస్తున్న బండి సంజయ్ కుమార్ సువిశాలమైన ఎస్‌ఆర్ అండ్ బీజీఎన్నార్ మైదానంలో లక్ష మందితో బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయా మైదానాల పరిశీలన సందర్భంగా అక్కడే పిల్లలతో కలిసి కాసేపు ఫుట్ బాల్ ఆడారు. అనంతరం నడుచుకుంటూ రోడ్డు వద్దకు వచ్చి స్థానిక సునీల్ కేఫ్‌లో కార్యకర్తలతో కలిసి ఛాయ్ తాగారు.

ఈ సందర్భగా బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ ఈనెల 15న సాయంత్రం 4 గంటలకు ఖమ్మం డిగ్రీ కాలేజీ స్టేడియంలో లక్ష మందితో బహిరంగ సభ నిర్వహించ బోతున్నామని, ఖమ్మంలో బిజెపి సత్తా, దమ్ము చూపడానికి కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ రోజు జరిగిన సన్నాహక సమావేశంలో కార్యకర్తల జోష్ చూస్తే లక్ష మందిని మించి సభకు హాజరయ్యే అవకాశముందన్నారు. ఖమ్మం ప్రజలు బీజేపీని ఆశీర్వదించాలని కోరుతున్నానని. దేశం కోసం, దేశ రక్షణ కోసం నిరంతరం శ్రమిస్తున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా జిల్లాకు వస్తున్న నేపథ్యంలో స్వచ్ఛందంగా తరలివచ్చి మద్దతు తెలపాలని ఆయన కోరారు.

ఈ సభ సక్సెస్ కోసం బీజేపీ కార్యకర్తలంతా పోలింగ్ బూత్‌ల వారీగా ప్రచారం చేయాలని, జన సమీకరణపై రాష్ట్ర సీనియర్ నాయకులతో ఓ కమిటీని వేయబోతున్నామన్నారు. నిరుద్యోగ మార్చ్ ఏ విధంగా సక్సెస్ అయ్యిందో అమిత్ షా బహిరంగ సభను ఇతర జిల్లాల్లో నిర్వహించాలని ఒత్తిడి వస్తున్నప్పటికీ కష్టాల్లో ఉన్న ఖమ్మం ప్రజలకు ఆత్మవిశ్వాసం కలిగించడానికి, బీజేపీ దమ్మేందో చూపడానికే ఇక్కడ ఏర్పాటు చేశామన్నారు.

  • కమ్యూనిస్టులు దాల్చా పార్టీలు

కమ్యూనిస్టుల గురించి ప్రస్తావిస్తూ అవి దాల్చా పార్టీలని వ్యంగ్య బాణాలు సంధించారు. వారు కూరగాయలు అమ్మే వారిని, కూలీలను పార్టీ ధర్నాలకు, సభలకు తీసుకోని వస్తారని, దాల్చా అంటే తెల్సా.. టోకెన్ ఇచ్చి హోటల్ లో భోజనం పెట్టించి ప్రజలను ధర్నాలకు తీసుకోని వస్తారని, వారి పని అయిపోయిందని ఎద్దవా చేశారు. వాటిని సూది దబ్బడం లేని పార్టీలు అని కేసీఆర్ అన్న విషయాన్నీ గుర్తు చేశారు. బిజెపి ఎదుగుదలను చూసి అనేక పార్టీలు ఓర్వలేక పోతున్నాయని ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు. దేశానికి నరేంద్రమోడీ అమిత్ షా ల నాయకత్వం అవసరమని దేశ ప్రజలే కాకుండా ప్రపంచమే గుర్తించిందన్నారు. అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్న భారత్ వైపు ప్రపంచం చూస్తున్నదని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News