మన తెలంగాణ/హైదరాబాద్: సోషల్ మీడియా వేధింపులతో సెలబ్రిటీలు ఆందోళన చెందుతున్నారు. అసభ్య, అశ్లీల కామెంట్లతో తాము ఆవేదన చెందుతున్నట్లు పలువురు సెలబ్రిటీలు వాపోతున్నారు. ఈ క్రమంలో సెలబ్రిటీ హోదా కలిగిన కొందరు ధైర్యంగా పోలీసుల ముందుకొస్తున్నా.. ఇంకానేక మంది సెలబ్రిటీలు మాత్రం ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెనుకాడుతున్నారు. సెలబ్రిటీలు ఎవరైనా ఈ రకమైన వేధింపులకు లోనైతే తక్షణమే తమకు ఫిర్యాదు చేస్తే తగు చర్యలు తీసుకుంటామని సైబర్ క్రైం పోలీసులు చెబుతున్నారు. సెలబ్రిటీల మీద ఎవరైనా ఈ రకమైన కామెంట్లకు పాల్పడితే సహించేది లేదని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇటీవలి కాలంలో సోషల్ మీడియా వేదికగా పలువురు సెలబ్రిటీలపై శృతిమించిన కామెంట్లు పెడుతూ వారిని తీవ్రమనో వేదనకు గురవుతున్నారు. తాజాగా యాంకర్, నటి అనసూయ, నటి మాధవీలతలు ఈ విషయంపై పోలీసులను ఆశ్రయించారు.
హైదరాబాద్ సీసీఎస్ పోలీసులకు ట్విట్టర్ ద్వారా అనసూయ ఫిర్యాదు
ప్రముఖ వ్యాఖ్యత, నటి అనసూయ హైదరాబాద్ సీసీఎస్ పోలీసులకు ట్విట్టర్ ద్వారా ఫిర్యాదు చేసింది. తనతో పాటు నాగార్జున, అనుష్కలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కోరింది. అనసూయ ఫిర్యాదుపై సానుకూలంగా ప్పందించిన సైబర్ క్రైం పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. అనసూయ, రాజేష్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేస్తున్నామన్నారు. అసలు ఈ ట్వీట్స్ ఎవరు చేశారు? ఎందుకు చేశారు? యాక్టర్స్ మసాలా అనే ట్విట్టర్ అకౌంట్ను ఎవరు ఆపరేట్ చేస్తున్నారు? అన్నదానిపై పోలీసు దర్యాప్తు కొనసాగుతోంది. రాతపూర్వకంగా అనసూయ ఫిర్యాదు చేస్తే వెంటనే చర్యలు చేపడతామని, ఎందుకంటే కేసుని కోర్టుకు సబ్మిట్ చేసేటప్పుడు సైన్డ్ కాపీ అవసరమవుతుందని సైబర్ క్రైమ్ ఎసిపి ప్రసాద్ తెలిపారు. లిఖిత పూర్వక ఫిర్యాదు లేకపోయినా ప్రాథమిక దర్యాప్తు చేపట్టి ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామన్నారు. పలువురు నటులపైనా అభ్యంతరకరమైన పోస్టులు పెట్టారని, వారు ముందుకొచ్చి ఫిర్యాదు చేస్తే ఇలాంటివి పునరావృతం కాకుండా చూస్తామన్నారు. స్పందించిన పోలీసులకు కృతజ్ఞతలు తెలియపరుస్తూ అనసూయ రీట్వీట్ చేసింది.
సైబరాబాద్ సీపీని కలిసి
ఫిర్యాదు చేసిన నటి మాధవీలత..
సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ను కలిశానని, తనపై వస్తున్న వేధింపులకు సంబంధించి రెండు ఫిర్యాదులు చేశానని వెల్లడించారు. ఈ విషయమై ఫేస్బుక్లో ఆమె స్పందించారు. తాను చేసిన ఫిర్యాదులలో ఒకటి తన వ్యక్తిగత వ్యవహారానికి సంబంధించింది కాగా.. మరొకటి సోషల్ మీడియాలో తనపై తప్పుడు వ్యాఖ్యలు చేస్తూ దూషించడానికి సంబంధించినదని వివరించారు. మనసు గాయపడేలా వ్యాఖ్యలు చేస్తున్నారని, వ్యక్తిత్వాన్ని కించపరిచేలా దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.
Anchor Anasuya Complaints over Online Abuse