అంగన్వాడీ కేంద్రాల ద్వారా పంపిణీ
రైతులకు పంట నష్టం కాకుండా ప్రభుత్వం తోడ్పాటు
రెండు శాఖల అధికారుల సమన్వయంతో పేదలకు అరటిపళ్ల సరఫరా
అధికారులను అభినందించిన మంత్రి సత్యవతి రాథోడ్
మనతెలంగాణ/హైదరాబాద్ : గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖలు విపత్కర సమయంలో కలిసి పనిచేసి గిరిజన ప్రాంతాల్లోని ప్రజలను ఆదుకోవాలని మంత్రి సత్యవతి రాథోడ్ ఆదేశాల మేరకు రెండు శాఖల అధికారులు కదిలారు. ఐటిడిఏ ప్రాంతాల్లోని అంగన్వాడీ లబ్ధిదారులకు గిరిజన శాఖ అండగా నిలవడంతో గర్భిణులు, చిన్నపిల్లలకు పోషకాహారం అందింది. ఇలా మంత్రి ఆదేశాల మేరకు అధికారులు శాఖల మధ్య సమన్వయాన్ని ఏర్పాటు చేసుకొని మంచి ఎలాంటి ఫలితాలు సాధించారు. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే… గిరిజన ప్రాంతాల్లోని ఐటిడిఏ పరిధిలోని పాఠశాలల విద్యార్థులకు పోషకాహరం అందించేందుకు గిరిజన శాఖ అక్కడి రైతులు పండించే అరటిపళ్లు కొనుగోలు చేసేది. అయితే కరోనా వైరస్ నేపథ్యంలో పాఠశాలలు మూత పడడంతో గిరిజన ప్రాంతాల్లోని అరటి రైతులు తమ పంటను వేరే చోటుకు తీసుకెళ్లి అమ్ముకోవడం ఇబ్బందిగా మారింది.
రైతు కష్టానికి ప్రతిఫలం
ఈ విషయం మంత్రి సత్యవతి దృష్టికి రావడంతో అరటి పళ్లను రైతుల నుంచి గిరిజన శాఖ ఆధ్వర్యంలో కొనుగోలు చేసి, వాటిని అంగన్ వాడీ కేంద్రాలకు సరఫరా చేసి, అక్కడ పేర్లు నమోదు చేసుకున్న గర్భిణులు, చిన్నపిల్లలకు అందించాలని మంత్రి అధికారులకు సూచించారు. వెంటనే గిరిజన సంక్షేమ శాఖ, మహిళా -శిశు సంక్షేమ శాఖ అధికారులు వెంటనే స్పందించి రైతుల దగ్గర నుంచి అరటిపళ్లు కొనుగోలు చేశారు. దీంతో రైతు కష్టానికి ప్రతిఫలం దక్కడంతో పాటు గిరిజన ప్రాంతాల్లోని గర్భిణులు, చిన్న పిల్లలకు పోషకాహారం కూడా అందుబాటులోకి వచ్చింది.
అటు రైతులకు, ఇటు గిరిజనులకు ఉపయోగపడేలా
అంగన్వాడీ కేంద్రాల్లో ఇచ్చే పాలు, గుడ్లు, పప్పు, ఇతర సరుకులతో పాటు అరటిపళ్లు కూడా ఇస్తున్నారు. ఐటిడిఏ ఉట్నూరు పరిధిలోని 4,500 మంది గర్భిణులు, 7,000 మంది చిన్న పిల్లలకు 400 అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఈ అరటిపళ్లను అందిస్తున్నారు. అంగన్ వాడీ సరుకులతో పాటు అరటిపళ్లను ఇవ్వడంపై గిరిజనులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రెండు శాఖల అధికారులు అటు రైతులకు, ఇటు గిరిజనులకు ఉపయోగపడే విధంగా సమన్వయం చేసుకోవడంతో మంత్రి సత్యవతి రాథోడ్ రెండు శాఖల అధికారులను అభినందించారు.