Thursday, April 25, 2024

అంగన్‌వాడీలో పెరిగిన వయోభారం

- Advertisement -
- Advertisement -

పదవీ విరమణ వయస్సు ఖారారుకు నిరీక్షణ
ఉత్తర్వులు ఇస్తే 4 వేలకు పైగా అంగన్‌వాడీల్లో ఖాళీలు

So many children concentrate on anganwadi
మనతెలంగాణ/ హైదరాబాద్ : మాతాశిశు సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం నాలుగు దశాబ్దాల క్రితం ఏర్పాటు చేసిన ఐసిడిఎస్‌లో విధులు నిర్వహిస్తున్న అంగన్‌వాడీ సిబ్బందికి వయోభారం అధికమవుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో ఐసిడిఎస్ పథకం ఆరంభించిన తొలినాళ్లలో విధుల్లోకి చేరిన అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు ప్రసుత్తం 65 ఏళ్లకు వయస్సు పైబడిన వారే అధికంగా ఉన్నారు. ఈ పథకాన్ని పలు ధఫాలుగా పొడిగించుకుంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొనసాగించడంతో.. ఈ కేంద్రాల్లో విధులు నిర్వహించే వారికి అరకొర వేతనాలతో దశాబ్దాలుగా పనిచేస్తున్నారు. తమను ప్రభుత్వోద్యోగులుగా గుర్తించి.. సర్వీస్ నిబంధనలు అమలు చేయాలని సిబ్బంది ఎంతోకాలంగా కోరుతున్నారు.

కేంద్రం ప్రవేశపెట్టిన ఐసిడిఎస్ పథకాన్ని అన్ని రాష్ట్రాలు కొనసాగిస్తున్నాయి. వివిధ రాష్ట్రాల్లో కేంద్రం ఇచ్చే పారితోషికంతో పాటు రాష్ట్రాలు కొంత మొత్తాన్ని కలిపి అంగన్‌వాడీ సిబ్బందికి అందజేస్తున్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వోద్యోగులకు వర్తింపజేసే పిఆర్‌సి కల్పిస్తూ… అంగన్‌వాడీ టీచర్లుకు రూ.13650, ఆయాలకు రూ.7800 అందజేస్తున్నారు. కేంద్రం కొవిడ్ సమయంలో వర్తింపజేసిన బీమాను ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్‌కు కింద రూ. 5౦ లక్షల అందజేసేయాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రసుత్తం అంగన్‌వాడీ కేంద్రాల్లో నాలుగు వేలు ఖాళీలు ఉండగా… ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో వయో పరిమితి 61 ఏళ్లకు కుదిస్తే.. మరో 4500 ఖాళీలు ఏర్పాడుతాయి.

వీటిలో ఆయాలు దాదాపు 3500 వందల వరకు ఉండే వీలుంది. ప్రసుత్తం అంగన్‌వాడీ కేంద్రాల్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది జివో 19 ప్రకారం ఉద్యోగ విరమణ పొందితే టీచర్లకు రూ.60 వేలు, ఆయాలకు రూ.30వేలు ఇస్తున్నారు. ఈ మొత్తాన్ని రూ. 5 లక్షల వరకు పెంచాలని అంగన్‌వాడీ సిబ్బంది కోరుతున్నారు. పదవీ విరమణ అనంతరం ఇచ్చే గౌరవ వేతనం ఆసరా పింఛన్‌లో భాగంగా ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రతిపాదించిన విషయాన్ని అంగన్‌వాడీ సిబ్బంది గుర్తుచేస్తూ ఆ మొత్తాన్ని గౌరవప్రదంగా రూ.3016 గా ఇవ్వాలని అంగన్‌వాడి సిబ్బంది కోరుతున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా 67411అంగన్‌వాడీ సిబ్బంది..

రాష్ట్రవ్యాప్తంగా 149 ఐసిడిఎస్ ప్రాజెక్టుల పరిధిలో 35,700 అంగన్‌వాడీ కేంద్రాలు పనిచేస్తున్నాయి. ఈ కేంద్రాల్లో దాదాపు 67411 అంగన్‌వాడీ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. ఈ కేంద్రాల ద్వారా 4 లక్షల మంది గర్భిణీలు, బాలింతలు, 14 లక్షల మంది ఆరేళ్లలోపు పిల్లలకు ప్రభుత్వం అందజేసే పోషకాహారంతో పాటు ఇతర సేవలను అంగన్‌వాడీ సిబ్బంది అందిస్తున్నారు. 31,711 మంది అంగన్‌వాడీ ఉపాధ్యాయురాలు, 3989 మంది మినీ అంగన్‌వాడీ టీచర్లు, 31,711 అంగన్‌వాడీ ఆయాలు పనిచేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేస్తున్న పలు పథకాలను ఈ కేంద్రాల ద్వారా అమలు చేస్తున్నారు.
కేంద్రాల ద్వారా పలు పథకాలు అమలు..
అంగన్‌వాడీ కేంద్రాల్లో ఆరోగ్యలక్ష్మీ పథకంలో బాలింతలు, గర్భిణీలు, ఆరేళ్ల లోపు పిల్లలకు పాలు, గుడ్లు, స్నాక్స్, బాలామృతం, భోజనం అందిస్తున్నారు. మహిళలు, బాలికల భద్రత, రక్షణ, గృహహింస చట్టంపై అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. బేటి పడావో బేటి బచావో, సఖీ కేంద్రాలు, హెల్ప్ లైన్ 181, మహిళాశక్తి కేంద్రాలు,కిశోర బాలికల పథకం, ఉజ్వల, స్వచ్ఛ భారత్ కార్యక్రమాలను కేంద్రాల్లో నిర్వహిస్తున్నారు. కోవిడ్ 19 సమయంలో ఇంటింటికి రేషన్ ఇవ్వడం వల్ల లబ్ధిదారుల సంఖ్య 16 లక్షల 82వేల 551 మంది నుంచి 19 లక్షల 68వేల 740కు పెరిగింది.

అంగన్‌వాడీల్లో న్యూటీగార్డెన్స్..

గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని అంగన్‌వాడీ కేంద్రాల ప్రాంగణాల్లో న్యూట్రీ గార్డెన్స్ ఏర్పాటు చేస్తున్నారు. న్యూట్రి గార్డెన్లను ఏర్పాటుతో రసాయనిక కలుషితం లేని తాజా కూరగాయలు, ఆకుకూరలను గర్భిణీలు, బాలింతలు, ఆరేళ్లలోపు పిల్లలకు అందిస్తున్నారు. ప్రాథమిక దశలో 233 అంగన్ వాడీ కేంద్రాలలో ఈ న్యూట్రీ గార్డెన్లను ఏర్పాటు చేశారు. స్టేట్‌హోమ్‌లోని ప్రాంగణంలో న్యూటి గార్డెన్ ఏర్పాటు చేసి తాజా కూరగాయలను శిశువిహార్‌లో వినియోగిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News