7కిలోమీటర్ల నడక, మధ్యలోనే ప్రసవం చేసిన ఎఎన్ఎంలు
ఆదివాసీ మహిళకు పురిటి నొప్పులు…
డోలీ కట్టి తీసుకెళుతుండగా ప్రసవం
మన తెలంగాణ/ములకలపల్లి : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలపరిధిలోని పూసుగూడెం పంచాయితీ పరిధిలో గల వలస ఆదివాసీ గిరిజనులు నివసిస్తున్న సోయం గంగులు నగర్ గ్రామానికి చెందిన మడకం దూలె అనే నిండు గర్భిణికి పురిటి నొప్పులు రావడంతో డోలి కట్టి తీసుకెళుతుండగా మార్గమధ్యంలోనే ప్రసవించింది. దూలెకు పురిటి నొప్పులు రావడంతో ఎఎన్ఎమ్ జ్యోతి, ఆశ కార్యకర్త ధనలక్ష్మి, అంగన్వాడీ వర్కర్ దుర్గాలు గ్రామస్తుల సహకారంతో డోలి కట్టి దూలెను వైద్యశాలకు తరలిస్తుండగా అడవి మార్గమధ్యలో మగబిడ్డను ప్రసవించింది. తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారు.
సోయం గంగులు నగర్ ప్రాంతంలో వలస ఆదివాసీయులు నివసిస్తున్నారు. ఈ ప్రాంతం పూసుగూడెం పంచాయితీకి సుదూర ప్రాంతం కావడంతోపాటు అటవీ ప్రాంతం కావడంతో రవాణా సౌకర్యాలు లేవు. ఎవరికైనా అనారోగ్య సమస్యలు వచ్చినా 7 కి.మీ. దూరంలోని పూసుగూడెంకు కాలినడకన వెళ్లాల్సి ఉంటుంది. శనివారం ఎఎన్ఎమ్ జ్యోతి, ఆశ కార్యకర్త ధనలక్ష్మి, అంగన్వాడీ వర్కర్ దుర్గా కరోనా వైరస్పై అవగాహన కలిపించేందుకు గ్రామానికి వచ్చారు. ఈ సమయంలో దూలె పురిటి నొప్పులతో బాధపడుతుండగా గమనించిన వారు డోలి ఏర్పాటుచేసి స్వయంగా తీసుకొని వస్తుండగా పండంటి శిశువుకు జన్మనిచ్చినది. తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నప్పటికీ, మరింత మెరుగైన వైద్యం కోసం ములకలపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తల్లిని, శిశివును తరలించారు.