హైదరాబాద్: మరోసారి శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో పేలుడు సంభవించింది. బుధవారం సాయంత్రం ఈ సంఘటన చోటుచేసుకుంది. భారీ శబ్ధాలతో మంటలు ఎగిసిపడడంతో భయంతో పవర్ప్లాంట్ సిబ్బంది బయటకు పరుగులు తీశారు. కరెంట్ కేబుల్ పైనుంచి డిసిఎం వ్యాన్ వెళ్లడంతో ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. అయితే ఇది ప్రమాదం కాదనీ, మాక్డ్రిల్లో భాగమేనని అధికారులు తెలిపారు. జెన్కో, ట్రాన్స్కో సిఎండి ప్రభాకర్రావు ప్రమాదాలు జరిగినప్పుడు ఎలా వ్యవహారించాలి, వాటిని ఎలా తప్పించుకోవాలన్న దానిపై మాక్డ్రిల్ నిర్వహించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే ఉద్యోగులు, సిబ్బంది అప్రమత్తంగా ఎలా ఉండాలి, ప్రమాదాల నుంచి ఎలా తప్పించుకోవాలన్న దానిపై అవగాహన కల్పించేందుకు బుధవారం మాక్డ్రిల్ నిర్వహించినట్టుగా అధికారులు తెలిపారు.
అయితే ఈ విషయం తెలియని స్థానికులు, ఉద్యోగులు మరోసారి నిజంగా ఇక్కడ ప్రమాదం జరిగిందని బెంబేలెత్తారు. అనంతరం ఇది మాక్డ్రిల్ అని తెలియడంతో వారంతా ఊపిరి పీల్చుకున్నారు. మాక్డ్రిల్ అనంతరం పలువురు ఉద్యోగులు మాట్లాడుతూ ప్రమాదాలు జరిగినప్పుడు భయపడకుండా ఎలా తప్పించుకోవాలి, తోటి ఉద్యోగులను ఎలా కాపాడుకోవాలన్న దానిపై ఇలాంటి మాక్డ్రిల్లు తోడ్పాటునందిస్తాయని వారు పేర్కొన్నారు. గత నెల 20వ తేదీన శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జలవిద్యుత్ కేంద్రంలో సంభవించిన భారీ అగ్నిప్రమాదం సంభవించి 9 మంది మృత్యువాత పడిన విషయం తెలిసిందే. ప్రస్తుం ఈ సంఘటనపై సిఐడి విచారణ కొనసాగుతోంది.
జెన్కో సివిల్ డైరెక్టర్ అజయ్ బృందం మాక్డ్రిల్ నిర్వహించింది- ట్రాన్స్కో, జెన్కో సిఎండి ప్రభాకర్ రావు
శ్రీశైలం ఎడగమట్టు విద్యుత్కేంద్రంలో మాక్డ్రిల్ నిర్వహించామని, ఎలాంటి అగ్నిప్రమాదం జరగలేదని ట్రాన్స్కో, జెన్కో సిఎండి ప్రభాకర్ రావు పేర్కొన్నారు. గత నెల 20వ తేదీన అగ్నిప్రమాదం జరిగిందని, అలాంటి సంఘటనలు విద్యుత్ కేంద్రంలో మరోసారి పునరావృత్తం కాకుండా ఉండాలన్న ఉద్ధేశ్యంతో జెన్కో సివిల్ డైరెక్టర్ అజయ్ బృందం మాక్డ్రిల్ నిర్వహించిందని సిఎండి ప్రభాకర్రావు తెలిపారు. ఇక్కడ ఎటువంటి అగ్నిప్రమాదం జరగలేదని, ఎవ్వరూ ఆందోళన చెందవద్దని ఆయన పేర్కొన్నారు.