న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్, బిజెపి ఎంపి పర్వేష్ వర్మలను ఢిల్లీ ఎన్నికల స్టార్ క్యాంపేనర్ల జాబితా నుంచి తొలగించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించినప్పటికీ బిజెపి మాత్రం వారి చేత ఎన్నికల ప్రచారం కొనసాగించాలని నిర్ణయించుకుంది. ఎన్ఆర్సి, సిఎఎకి వ్యతిరేకంగా నిరసనలు నిర్వహిస్తున్న నిరసనకారులపై తీవ్ర పదజాలంతో వ్యాఖ్యలు చేసిన ఈ బిజెపి నాయకులిద్దరినీ ఢిల్లీ ఎన్నికల ప్రచారం నుంచి తప్పించాలన్న ఎన్నికల సంఘం ఆదేశాలకు బిజెపి ఢిల్లీ ఎన్నికల మీడియా ఇన్చార్జి అశోక్ గోయల్ కొత్త భాష్యం చెప్పారు. స్టార్ క్యాంపేనర్ల జాబితా నుంచి వారి పేర్లను తొలగించాలని ఇసి చెప్పింది తప్ప వారు ప్రచారం చేయకూడదని చెప్పలేదని ఆయన అన్నారు. ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గత వారం రోజుల నుంచి బిజెపికి చెందిన ఈ నాయకులు మతపరమైన చీలికలు తీసుకురావడమే లక్ష్యంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు.
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఢిల్లీలోని షహీన్బాగ్లో గడచిన నెలరోజులకు పైగా ప్రదర్శనలు నిర్వహిస్తున్న నిరసనకారులనుద్దేశించి వెస్ట్ ఢిల్లీ ఎంపి పరేష్ వర్మ ఇటీవల వ్యాఖ్యానిస్తూ ఢిల్లీలో బిజెపి అధికారంలోకి రాకపోతే ఈ నిరసనకారులు మీ ఇళ్లలోకి చొరబడి మీ తల్లి చెల్లెళ్లను రేప్ చేసి చంపుతారంటూ ఆరోపించారు. కాగా, కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మరో అడుగు ముందుకు వేసి నిరసనకారులను దేశద్రోహులుగా ముద్రవేస్తూ వీరిని కాల్చిచంపాలంటూ పిలుపునిచ్చారు. ఈ వివాదాస్పద వ్యాఖ్యలపై ఇసి స్పందిస్తూ వీరిని ప్రచారం నుంచి తప్పించాలని బిజెపిని ఆదేశించింది.
Anurag Thakur, Parvesh Verma will campaign