హైదరాబాద్: కేంద్ర జల్ శక్తి ఆధ్వర్యంలో మంగళవారం మధ్యాహ్నం 12గంటలకు అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరగనుంది. ఈ నేపథ్యంలో అధికారులు, ఇంజనీర్లు ప్రగతి భవన్ చేరుకున్నారు. ఈ అపెక్స్ కౌన్సిల్ భేటీలో సిఎం కెసిఆర్, ఎపి సిఎం జగన్ వీడియోకాన్ఫరెన్స్ ద్వారా పాల్గొనున్నారు. జలవివాదాలపై తమ వాదనలు వినిపించడానికి తెలుగురాష్ట్రాలు సిద్ధమయ్యాయి. పరస్పర ఫిర్యాదులు, అభ్యంతరాల దృష్ట్యా ఈ సమావేశానికి ప్రాధాన్యత నెలకొంది. అయితే నీటి కేటాయింపుల్లో రాజీ ప్రసక్తేలేదని తెలంగాణ రాష్ట్రం స్పష్టం చేసింది. రాష్ట్రానికి దక్కాల్సిన వాటాపై గట్టిగానే వ్యవహరించాలని నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ వాదనలకు దీటుగా సమాధానం చెప్పాలని సిఎం కెసిఆర్ నిర్ణయం తీసుకున్నారు. కేంద్రం కూడా ఈ భేటీతో కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం కనబడుతోంది.
నాలుగు అంశాలను అజెండాగా నిర్ణయించింది అపెక్స్ కౌన్సిల్. అజెండాలోని అంశాలపై జల్ శక్తి అధికారులతో కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ చర్చించారు. ఇరురాష్ట్రాలు లేవనెత్తే అంశాలు, కెసిఆర్ లేఖలోని విషయాలు గురించి చర్చించినట్లు సమాచారం. శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణనూ తమకే అప్పగించాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతోంది. ప్రాజెక్టుల నిర్వహణను పూర్తిగా బోర్డుకే అప్పగించాలని ఎపి అంటున్నట్టు తెలుస్తోంది. ఈ భేటీలో కృష్ణా జలాలపై విచారణ జరపాలని కెసిఆర్ కేంద్రాన్ని గట్టిగా కోరనున్నారు. అంతరాష్ట్ర జలవివాద చట్టం-1956లోని సెక్షన్ 3 ప్రకారం విచారణకు ముఖ్యమంత్రి కెసిఆర్ డిమాండ్ చేశారు.