హైదరాబాద్ : ఇంటర్ ఒకేషనల్ కోర్సులలో మల్టిపర్పస్ హెల్త్ వర్కర్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ పూర్తి చేసిన విద్యార్థులకు
ప్రైవేట్ ఆసుపత్రులు, నర్సింగ్ హోంలలో అప్రెంటిషిప్ శిక్షణ నిర్వహణపై బుధవారం ఇంటర్మీడియేట్ కమిషనర్ కార్యాలయంలో బుధవారం ఉదయం 11 గంటలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటర్ విద్య కమిషనర్ సయ్యద్ జలీల్ ఉమర్ మాట్లాడుతూ, మల్టిపర్పస్ హెల్త్ వర్కర్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ పూర్తి చేసిన విద్యార్థులకు ఒక ఏడాది అప్రెంటిషిప్ శిక్షణ ఇవ్వాలని ప్రైవేట్ ఆసుపత్రులను కోరారు. ఈ ఏడాది ఏప్రిల్, మే నెలలో సుమారు 10 వేల మంది మల్టిపర్పస్ హెల్త్ వర్కర్లు, 9 వేల మంది మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్లు అప్రెంటిషిప్ పొందనున్నట్లు పేర్కొన్నారు.
ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాల ప్రతినిధులు మాట్లాడుతూ, ఇంటర్ ఒకేషనల్ కోర్సులలో తమ అవసరమైన రేడియోగ్రఫీ, లైసన్ ఆఫీసర్, ఫ్రంట్ ఆఫీస్ మేనేజ్మెంట్, డయాలసిస్ అసిస్టెంట్, ఆపరేషనల్ థియేటర్ అసిస్టెంట్, అనస్థీషియా అసిస్టెంట్ కోర్సులు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్కిల్ డవపల్మెంట్, ఎంటర్ప్రీనర్షిప్ రీజనల్ డైరెక్టరేట్ డైరెక్టర్ ఎ.వెంకటేశ్వరరావు, తెలంగాణ హాస్పిటల్స్ అండ్ నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్ ప్రతినిధులు అల్వాల్ రెడ్డి, సురేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.