కొలంబో: భారత్ వేదికగా జరిగిన 2011 ప్రపంచకప్ ఫైనల్లో శ్రీలంక కావాలనే ఓడిపోయిందని ఆ దేశ అప్పటి క్రీడా మంత్రి మహీంద నంద చేసిన ఆరోపణపై భారత ప్రభుత్వం విచారణ జరపాలని శ్రీలంక దిగ్గజ క్రికెటర్ అరవింద డిసిల్వా కోరాడు. ఫైనల్లో శ్రీలంక ఆటతీరు ఎన్నో అనుమానాలకు తావిచ్చిందని, మ్యాచ్ జరిగిన తీరు చూస్తే లంక కావాలనే ఓడిపోయిందనే విషయం స్పష్టమవుతోందని మహీంద నంద ఆరోపించిన విషయం తెలిసిందే. కాగా, మహీందనంద ఆరోపణలు అప్పటి శ్రీలంక క్రికెట్ బోర్డు సెలెక్షణ్ కమిటీ చైర్మన్గా ఉన్న డిసిల్వా ఖండించాడు.
మహీందనంద ఆరోపణలన్నీ అవాస్తమని కొట్టి పారేశాడు. మరోవైపు ఫైనల్ జరిగిన తీరుపై భారత క్రికెట్ బోర్డు, అంతర్జాతీయ క్రికెట్ మండలి పూర్తి స్థాయి విచారణ జరపాలని డిసిల్వా సూచించాడు. ఫైనల్ జరిగిన తీరుపై అనుమానాలు ఉంటే భారత ప్రభుత్వాన్ని కోరి విచారణ జరిపించుకోవాలని డిమాండ్ చేశాడు. ఒకవేళ విచారణలో శ్రీలంక క్రికెటర్లు దోషులుగా తేలితే కఠిన చర్యలు తీసుకోవాలని డిసిల్వా కోరాడు.