హైదరాబాద్ : నగరంలో ఫిబ్రవరి 1 నుండి 20వ తేదీవరకు జరిగే ఇంటర్మీడియెట్ మొదటి, రెండవ సంవత్సరం ప్రాక్టికల్ పరీక్షల నిర్వహణలో ఎటువంటి లోపాలు లేకుండా సజావుగా నిర్వహించేందుకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ జి.రవి అధికారులను ఆదేశించారు. మంగళవారం తన చాంబరులో జరిగిన సమన్వయ సమావేశంలో జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ.. ఇంటర్మీయెట్ ప్రాక్టికల్ పరీక్షలు మొదటిసారిగా ఆన్లైన్ ద్వారా నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈపరీక్షలు మొత్తం 170 కేంద్రాల్లో రెండుసెషన్లలో నిర్వహించడం జరుగుతుందన్నారు. సుమారు 35వేల మంది అభ్యర్దులు పరీక్షకు హాజరుకానున్నారని తెలిపారు.
పరీక్షలకు హాజరయ్యే అభ్యర్దులు పరీక్ష కేంద్రాలకు అరగంట ముందుగానే చేరుకోవాలని జేసి సూచించారు. పరీక్ష పత్రాలను ఆన్లైన్ ద్వారా తీసుకోవాలసి ఉంటుంది పరీక్ష సమయంలో నిరంతరం విద్యుత్తు సరఫరా చేయాలని విద్యుత్శాఖ వారిని ఆదేశించారు. ప్రతి పరీక్షా కేంద్రంలో ప్రాథమిక చికిత్స కిట్లతో పాటు ఎఎన్ఎంలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారికి సూచించారు.
పరీక్ష కేంద్రాల్లో మంచినీటి సరఫరాతో పాటు బందోబస్తు ఏర్పాటు చేయాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. పరీక్ష కేంద్రాలకు వెళ్లే రూట్లల్లో బస్సులను అదనంగా, పరీక్షల సమాయానికి అనుగుణంగా నడిపేలా చర్యలు తీసుకోవాలని ఆర్టీసి అధికారులను ఆదేశించారు. ఈసమావేశంలో జిల్లా ఇంటర్మీడియెట్ పరీక్షల అధికారి, కన్వీనర్ జయప్రదబాయి, ఆర్టీసి డిఎం కృపాకర్రెడ్డి, జనరల్ డివిజన్ మేనేజర్ అపర్ణా కళ్యాణి, ట్రాఫిక్ అధికారి విద్యాసాగర్, విద్యుత్తు శాఖ డిఈ అశోక్, జలమండలి అధికారి జగదీశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు.