Thursday, April 25, 2024

యుపిలో సంచలన ఎన్‌కౌంటర్

- Advertisement -
- Advertisement -

లక్నో : ఉత్తరప్రదేశ్‌లో గురువారం సంచలనాత్మక ఎన్‌కౌంటర్ జరిగింది. రాజకీయనేత అయిన గ్యాంగ్‌స్టర్ అతీఖ్ అహ్మద్ కుమారుడు అసద్‌ను ఆయన సహచరుడు ఒక్కరిని ఉత్తరప్రదేశ్ పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. గ్యాంగ్‌స్టర్స్, మాటవినని రౌడీల పని పడుతామని, వారిని ఏరేస్తామని పలుసార్లు సిఎం యోగి ఆదిత్యానాథ్ ప్రకటిస్తూ వస్తున్న దశలోనే ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. 2005 నాటి ఓ హత్యకేసులో ప్రత్యక్ష సాక్షి అయిన ఉమేష్ పాల్‌ను ఈ ఏడాది ఫిబ్రవరిలో కాల్చిచంపిన ఉదంతం తీవ్ర ప్రకంపనలు ఇప్పుడు ఈ ఎన్‌కౌంటర్‌కు దారితీశాయి. లాయర్ కూడా అయిన ఉమేష్ పాల్ హత్యకేసులో అతీఖ్ అహ్మద్ ప్రధాన నిందితుడు , కాగా ఈ కేసులో ఆయన కుమారుడు, అనుచరుడు గులామ్ కూడా నిందితులు. వీరు తప్పించుకుని తిరుగుతున్నారని, వాంటెడ్‌గా ఉన్న వీరిని గురువారం తెల్లవారుజామున గుర్తించినట్లు ఈ క్రమంలో తాము జరిపిన కాల్పుల్లో వీరిద్దరూ చనిపోయినట్లు ఝాన్సీ పోలీసులు గురువారం విలేకరులకు తెలిపారు.

Also Read: చీమలపాడు ప్రమాద బాధితులకు కెటిఆర్ పరామర్శ

ఓ వైపు ఉమేష్ పాల్ హత్యకేసులో నిందితుడు అయిన అతీఖ్‌ను గురువారం ప్రయాగ్‌రాజ్‌లో చీఫ్ జుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపర్చి, విచారణ తరువాత 14 రోజుల జుడిషియల్ కస్టడీకి పంపించిన దశలోనే ఇప్పటి ఎన్‌కౌంటర్ జరిగింది. ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన హత్యకేసులో అసద్, గులామ్‌లు వాంటెడ్‌గా ఉన్నారని వారిపై తలా ఐదులక్షల రూపాయిల రివార్డు ఉందని , ఉత్తరప్రదేశ్‌కు చెందిన సిట్ టీమ్ ఎన్‌కౌంటర్‌లో వీరు మృతి చెందారని శాంతి భద్రతల ప్రత్యేక డైరెక్టర్ జనరల్ ప్రశాంత్ కుమార్ తెలిపారు. ఎన్‌కౌంటర్ జరిగిందని పోలీసులు చెపుతున్న ప్రాంతంలో ఓ మోటారు సైకిల్ పక్కన రెండు మృతదేహాలు పడి ఉన్నాయి. తరువాత అంబులెన్స్‌లో వీటిని తరలించారు. ఫిబ్రవరి 24 న ఉమేష్ పాల్ హత్య జరిగిన నాటి నుంచి వీరిద్దరూ తప్పించుకుని తిరుగుతున్నారని ఎస్‌టిఎఫ్ అధికారులు తెలిపారు.

వారిని పట్టుకునేందుకు పలు ప్రత్యేక దళాలు రంగంలోకి దిగాయి. ఇప్పుడు వీరిని గురువారం ఓ చోట కనుగొన్నామని, తమను చూడగానే వీరు పారిపోయేందుకు యత్నించారని దీనితో కాల్పులు జరిపినట్లు, దీనితో వారు హతులయ్యారని అధికారులు తెలిపారు. ఝాన్సీ వద్ద బైక్‌పై పారిపోయేందుకు యత్నించారని, పట్టుకునే దశలో తప్పనిసరిగా కాల్పులు జరపాల్సి వచ్చిందని వెల్లడించారు. వారు ముందుగా తమపై కాల్పులకు దిగారని, దీనితో తాము ఎదురు కాల్పులకు దిగాల్సి వచ్చిందని వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News