అమ్మాయిల పెళ్లి వయస్సు పెంచే బదులు
అబ్బాయిల వివాహ వయస్సు 21 నుంచి 18 సంవత్సరాలకు తగ్గించాలి
హైదరాబాద్: అమ్మాయిల పెళ్లి వయసు 18 సంవత్సరాల నుంచి 21 సంవత్సరాలకు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఎంఐఎం అధినేత, ఎంపి అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమ్మాయిల పెళ్లి వయసు పెంచే బదులు అబ్బాయిల వివాహ వయసు 21 సంవత్సరాల నుంచి 18 ఏళ్లకు తగ్గించాలని ఓవైసీ డిమాండ్ చేశారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ మోదీ ప్రభుత్వ పితృస్వామ్య విధానాలకు ఈ నిర్ణయమే నిదర్శనమన్నారు. 18 ఏళ్ల వయసున్న వారు ఒప్పందాలపై సంతకాలు చేయొచ్చని, వ్యాపారాలు ప్రారంభించవచ్చని, ప్రధానమంత్రి, ఎంపి, ఎమ్మెల్యేలను ఎన్నుకోవచ్చని పెళ్లి మాత్రం చేసుకోకూడదా అని ఆయన ప్రశ్నించారు.
సెక్స్వల్ రిలేషన్ షిప్లో ఉండేందుకు, లివింగ్ పార్ట్నర్ షిప్ తో ఉండడానికి నిర్ణయం తీసుకోవచ్చు కానీ, వాళ్ళ జీవిత భాగస్వామిని ఎంచుకోకూడదా ? అంటూ ఓవైసీ ఫైర్ అయ్యారు. దేశంలో ప్రతి నలుగురు అమ్మాయిల్లో ఒకరికీ 18 ఏళ్ల లోపే పెళ్లి చేస్తున్నారని, కానీ వాటిపై కేవలం 785 క్రిమినల్ కేసులు మాత్రమే నమోదయ్యాయని ఆయన గుర్తుచేశారు. నిజంగా మహిళలపై ప్రధాని మోదీకి ప్రేమ ఉంటే వారి ఆర్థిక స్థితిగతులను తెలుసుకుని మెరుగు పరిచేందుకు అవకాశాలు కల్పించాలని, ఉపాధి, ఉద్యోగాలు అందించాలని ఆయన డిమాండ్ చేశారు. మహిళల ఓట్ల కోసమే కేంద్రం ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటుందని ఆయన ఎద్దేవా చేశారు.