Friday, March 29, 2024

షెడ్యూల్ ప్రకారమే అసెంబ్లీ ఎన్నికలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై బిఆర్‌ఎస్ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ స్పష్టతనిచ్చారు. రాష్ట్రంలో షెడ్యూల్ ప్రకారమే అసెంబ్లీ ఎన్నికలు ఉంటాయని స్పష్టం చేశారు. సర్వేలన్నీ మనకే అనుకూలంగా ఉన్నాయని ఆయన తెలిపారు. తెలంగాణ భవన్‌లో జరుగుతున్న బిఆర్‌ఎస్ వి స్తృత స్థాయి సమావేశంలో పలు అంశాలపై పార్టీ నేతలకు కెసిఆర్ దిశానిర్దేశం చేశారు. ఎన్నికలు డిసెంబర్‌లో ఉంటాయని, ఆలోపు ఎ న్నికలకు ప్లాన్ చేసుకోవాలని నియోజకవర్గాల్లోనే ఉండి ప్ర జల్లోకి వెళ్లాలని కెసిఆర్ ఆదేశించారు. నియోజకవర్గాల్లో వీలైతే పాదయాత్రలు చేయాలని, వీలైనన్నీ ఎక్కువగా కార్యకర్తల సమావేశాలు నిర్వహించి, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు.

సాయన్నకు నివాళి

బిఆర్‌ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు, సిఎం కెసిఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్‌లో శుక్రవారం ఆనడు పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు, ఎంపి లు, ఎంఎల్‌సిలు, ఎంఎల్‌ఎలు, పార్టీ రాష్ట్ర కా ర్యవర్గం, పలు కార్పొరేషన్ల చైర్మన్లు, మేయర్ లు, డిసిసిబి, డిసిఎంఎస్ అధ్యక్షుడు పాల్గొన్నారు. పార్టీ అధినేత సిఎం కెసిఆర్ మధ్యా హ్నం 3.20 గంటలకు తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. సమావేశానికి ముందుగా ఇటీవల మృతి చెందిన పార్టీ ఎంఎల్‌ఎ బండి సాయన్న చిత్రపటానికి సిఎం కెసిఆర్ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం సమావేశాన్ని ప్రారంభిస్తూ బండి సాయన్న మరణం పట్ల సంతాపాన్ని ప్రకటించారు. భగవంతుడు ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని, వారి కుటుంబానికి దు:ఖాన్ని తట్టుకునే శక్తిని కల్పించాలని భగవంతున్ని ప్రార్థించారు. సమావేశం సాయన్న మరణానికి సంతాపం ప్రకటిస్తూ కాసేపు మౌనం పాటించింది.

తలసరి ఆదాయంలో దేశంలోనే నెంబర్

ఈ సందర్భంగా పార్టీ అధినేత, సిఎం కెసిఆర్ మాట్లాడుతూ రాష్ట్రం తలసరి ఆదాయంలో దేశంలోనే ముందు వరుసలో దూసుకుపోతుందన్నారు. స్వయంపాలనను విఫలయత్నంగా చేయాలని ప్రారంభదశలో సృష్టించిన అనేక అడ్డంకులను దాటుకొని మనం నిలబడ్డామని ఆయన తెలిపారు. రాష్ట్రం సాధించిన పురోగతిని చూసిన ఆ తర్వాత జరిగిన ప్రతి ఎన్నిల్లో ప్రజలు మనకు అండగా నిలబడ్డారన్నారు. విద్యుత్ కోతలు లేకుండా చేసుకున్నామని, సాగునీటి రంగాన్ని తీర్చిదిద్దుకున్నా మన్నారు. ఇవాళ ప్రతి ఇంటికి తాగునీరు నల్లాల ద్వారా అందుతుందన్నారు. సంక్షేమ, అభివృద్ధి రంగాల్లో దేశంలోనే నెంబర్ వన్ స్థాయికి తెలంగాణ చేరుకుందన్నారు.

వరి పంట ఉత్పత్తిలోనూ..

వరి పంట ఉత్పత్తిలో తెలంగాణ నెంబర్‌వన్‌గా నిలిచిందన్నారు. పసిపిల్లలు, ముసలివాళ్ల నుంచి ఆడబిడ్డలు వరకు, రైతన్నల నుంచి ఐటి, పరిశ్రమల వరకు ప్రతి రంగంలో సంక్షేమం, అభివృద్ధి సాధిస్తూ తెలంగాణ రాష్ట్రం నేడు సమ్మిళితాభివృద్ధిని సాధించిందని కెసిఆర్ పేర్కొన్నారు. ఇవాళ విదేశాల నుంచి తెలంగాణకు పెట్టుబడుల వెల్లువ కొనసాగుతోందన్నారు. మన పారిశ్రామిక విధానాలను ప్రపంచం మెచ్చుకుంటుందని, ప్రపంచ దిగ్గజ కంపెనీలు హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నారన్నారు. ఒకప్పుడు ఐటి రంగంలో సిలికాన్ వ్యాలీగా చెప్పుకున్న బెంగుళూరును మించి హైదరాబాద్ ఐటి రంగంలో పురోగతిని సాధిస్తుందన్నారు.

మరింతగా ప్రజల్లోకి మన పార్టీని తీసుకెళ్లాలి

ప్రపంచ ప్రఖ్యాత కంపెనీ ఫాక్స్‌కాన్ చైర్మన్ తెలంగాణ అభివృద్ధిని చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉందని చెప్పడం మనందరికీ గర్వకారణమన్నారు. ఇంతటి అభివృద్ధి సాధించిన మన పార్టీ ఘనవిజయాలను గుర్తు చేసుకుంటూనే, మరింతగా ప్రజల్లోకి మన పార్టీని, మన ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చెప్పుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ ప్రగతిని బిజెపి పార్టీ ఓరుస్తలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ సాధిస్తున్న అభివృద్ధిని బిజెపి పార్టీ ఓర్వలేకపోతుందన్నారు. దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణ సంక్షేమ పథకాలు ఇతర రాష్ట్రాలను ఆకర్షిస్తున్న నేపథ్యంలో తమ పార్టీ చేతకాని తనం, బయటపడుతుందన్న అక్కసుతో అనేక కుట్రలకు బిజెపి పాల్పడుతుందని, టిఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులను వేధిస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ దేశం నుంచి బిజెపి పార్టీని పారద్రోలాలి

ఇప్పటికే మన పార్టీ మంత్రులను, ఎంపిలను, ఎంఎల్‌ఎలను, ఎంఎల్‌సిలను సిబిఐ, ఐటి, ఈడి దాడులతో తప్పుడు ఆరోపణలతో వేధిస్తుందని కెసిఆర్ ఆరోపించారు. బిజెపి వేధింపులను ఎంతవరకైనా తిప్పికొడతామని, ఎదుర్కొంటా మన్నారు. ఈ దేశం నుంచి బిజెపి పార్టీని పారద్రోలే వరకూ మన పోరాటం కొనసాగుతూనే ఉంటుందన్నారు.

ప్రజాప్రతినిధులకు కెసిఆర్ ఆదేశాలు

బిఆర్‌ఎస్ పార్టీకి కార్యకర్తలే బలమని వారితో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించాలి. ఇందుకు ఎంఎల్‌ఎలు బాధ్యత తీసుకోవాలని కెసిఆర్ సూచించారు. ప్రతి పది గ్రామాలను యూనిట్‌గా తీసుకొని ఎంఎల్‌ఎలు పార్టీ సభ్యులతో ఆత్మీయ సమ్మేళనాలను నిర్వహించాలని కెసిఆర్ పేర్కొన్నారు. ఈ సమ్మేళనాల్లో ఎంపిలను, ఎంఎల్‌సిలను, ఎంఎల్‌ఎలను, కార్పొరేషన్ చైర్మన్లను డిసిసిబి, డిసిఎంఎస్ తదితర పార్టీ ముఖ్యులను కలుపుకొని పోవాలని, ఈ ఆత్మీయ సమ్మేళనాలను రెండు నెలల్లోపు పూర్తి చేయాలని కెసిఆర్ ఆదేశించారు. ప్రజాప్రతినిధులు వీలయినంత వరకు ప్రజల్లోనే ఉండాలని, కంటి వెలుగు శిబిరాలతో ప్రజల్లో మంచి స్పందన వస్తుందని, వీటిని స్థానిక ఎంఎల్‌ఎలు ప్రతిరోజు ఒక బాధ్యతగా సందర్శించాల్సిన అవసరం ఉందని కెసిఆర్ పేర్కొన్నారు. త్వరలో నిర్వహించబోయే పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల కోసం ప్రజాప్రతినిధులు సిద్ధంగా ఉండాలన్నారు.

ఏప్రిల్ 14న అంబేద్కర్ విగ్రహావిష్కరణ

ఏప్రిల్ 14వ తేదీన బిఆర్ అంబేద్కర్ జయంతి రోజున అంబేద్కర్ 125 అడుగుల విగ్రహావిష్కరణ కార్యక్రమం ఉంటుందని కెసిఆర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ స్టేడియంలో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నామని, ఈ సభకు అన్ని నియోజకవర్గాల నుంచి దళితబిడ్డలు పాల్గొంటారని ఆయన తెలిపారు. సాంస్కృతిక సారథి ఆధ్వర్యంలో అంబేద్కర్‌కు ఘన నివాళి అర్పిస్తూ, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన సూచించారు.

బిఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం, -ఆత్మీయ సభల నిర్వహణ

బిఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భావం నేపథ్యంలో ఏప్రిల్ 25న పార్టీ జెండాల ఆవిష్కరణ అనంతరం నియోజకవర్గ కేంద్రాల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రజాప్రతినిధుల సభ నిర్వహించాలని కెసిఆర్ సూచించారు. ఏప్రిల్ 27న ఎల్‌బి స్టేడియంలో రాష్ట్ర స్థాయి ప్రతినిధుల సభ నిర్వహిస్తామని, ఈ సభలో పార్టీకి సంబంధించిన అన్ని కేటగిరీలకు చెందిన ప్రజాప్రతినిధులు పాల్గొంటారన్నారు. ఏప్రిల్ 27న పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి సంబంధించి బహిరంగ సభను అక్టోబర్‌లో వరంగల్ వేదికగా నిర్వహిస్తామని ఆయన తెలిపారు.

సచివాలయ భవనం ప్రారంభోత్సవం

ఏప్రిల్ 30వ తేదీన డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ సచివాలయ భవనం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని, ఈ కార్యక్రమంలో పార్టీ ఎంపిలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో సహా, అందరూ ఆహ్వానితులేనని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో పార్టీల అన్ని కేటగిరీల నాయకులు దీనికి హాజరు కావాలని ఆయన పేర్కొన్నారు.

జూన్ 01న అమరవీరుల జ్యోతి ప్రారంభోత్సవం

రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న అమరవీరుల జ్యోతి నిర్మాణ పనులు పూర్తికావచ్చాయి. తెలంగాణ రాష్ట్ర సాధనకు కారకులైన అమరవీరులను స్మరించుకునేందుకు, వారి ఘనమైన నివాళులు అర్పించుకునేందుకు నిర్మించిన తెలంగాణ అమర జ్యోతిని జూన్ 01వ తేదీన ప్రారంభించుకుందామని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో అమరవీరులకు ఘనంగా నివాళులర్పించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ ప్రతినిధులు భారీ ఎత్తున పాల్గొనాలన్నారు. జూన్ 02 న వారి వారి నియోజకవర్గాల్లో రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో పాల్గొనాలని కెసిఆర్ సూచించారు.

బిఆర్‌ఎస్వీ బలోపేతం

బిఆర్‌ఎస్వీ విద్యార్థి సంఘాన్ని మరింత బలోపేతం చేయాలని కెసిఆర్ పేర్కొన్నారు. రాష్ట్రస్థాయి, జిల్లా స్థాయి కమిటీల సమావేశాలు విద్యార్థిసంఘ బలోపేతానికి చర్యలు చేపట్టాలని కెసిఆర్ సూచించారు. ఇంకా మిగిలిన ఉన్న పార్టీ జిల్లా కార్యాలయాల ప్రారంభోత్సవాలను పూర్తి చేయాలన్నారు. ఎన్నికల కోడ్ అనంతరం ఇంకా మిగిలి ఉన్న డబుల్ బెడ్ రూం ఇళ్ల పంపిణీని పూర్తి చేయాలని ఆయన సూచించారు. 58,59 జీఓల ప్రకారం దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం గడువు పెంచిన నేపథ్యంలో ఈ అవకాశాన్ని ఎమ్మెల్యేలు పేదలు సద్వినియోగం చేసుకోవాలన్నారు..

దళితబంధు రెండో విడత పంపిణీ వేడుకలు

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దళితబంధు పథకం లబ్ధిదారుల ఎంపికలో స్థానిక ఎమ్మెల్యేలే ప్రతిపాదనలు చేసి సంబంధిత కలెక్టర్లకు పంపించాలని కెసిఆర్ సూచించారు. ఎమ్మెల్యేల ప్రతిపాదనలను అనుసరించి కలెక్టర్లు లబ్ధిదారుల ఎంపికను పూర్తి చేసి, వారికి నిబంధనల ప్రకారం దళితబంధు ప్రయోజనాన్ని కల్పిస్తారని కెసిఆర్ పేర్కొన్నారు. దళితబంధు నిధుల విషయంలో అవినీతికి ఆస్కారం లేకుండా లబ్ధిదారులకు నిధులు అందేలా చూడాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలదేనని ఆయన తెలిపారు. దళితబంధు పథకం అమల్లోకి వచ్చిన ఆగష్టు 16 వ తేదీని పురస్కరించుకొని ప్రభుత్వ నిర్ణయం ప్రకారం దళితబంధు వేడుకలను భారీ స్థాయిలో నిర్వహించాలని నిర్ణయించినట్టు ఆయన తెలిపారు.

గృహలక్ష్మి పథకం

సొంత జాగాలో ఇళ్ల నిర్మాణానికి రూ.3 లక్షలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను స్థానిక ఎమ్మెల్యేలు సిద్ధం చేసి కలెక్టర్లకు పంపించాలని కెసిఆర్ సూచించారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా అర్హులను గుర్తించి, వారికి గృహలక్ష్మి పథకం కింద భార్య పేరు మీదుగా రిజస్ట్రేషన్ చేసి బ్యాంకు ఖాతాల్లో మూడు దశల్లో, ప్రతి దశలోనూ లక్ష రూపాయల చొప్పన బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరుగుతుందన్నారు. నియోజకవర్గానికి 3 వేల ఇళ్ల చొప్పున మంజూరు చేయనున్నట్టు ఆయన తెలిపారు. లబ్ధిదారునికి అన్ని రకాల ప్రభుత్వం ఇచ్చిన భూమి అయినా, పట్టా భూమి అయినా, అన్ని రకాల స్థలాల్లో కట్టుకునే అవకాశం కల్పిస్తామన్నారు.

గృహలక్ష్మి పథకాన్ని భార్య పేరు మీద అమలుచేస్తున్నందున, భర్త పేరు మీద భూమి ఉన్నట్లయితే భార్య పేరు మీదకు ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పిస్తామన్నారు. పునాది సమయంలో లక్ష రూపాయలు, స్లాబు వేసిన అనంతరం లక్ష రూపాయలు, చివరగా నిర్మాణం పూర్తయి సున్నాలు వేసిన దశలో లక్ష రూపాయలను ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి విధి, విధానాలు, నియమ, నిబంధనలను అనుసరించి అవినీతికి ఎటువంటి తావు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులదేనని ఆయన తెలిపారు. పేదలకు అందే పథకాల్లో అవినీతి జరిగితే క్షమించే ప్రసక్తే లేదనీ, ఇది ఎమ్మెల్యేల భవిష్యత్‌పై ప్రభావం చూపుతుందని, జాగ్రత్తగా వ్యవహారించాలన్నారు.

గొర్రెల పంపిణీ

ప్రభుత్వం రెండో దశ గొర్రెల పంపిణీనిన ప్రారంభిస్తున్న నేపథ్యంలో అవినీతి లేకుండా లబ్ధిదారులకు ప్రయోజనం అందేలా చూడాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలదేనని కెసిఆర్ తెలిపారు. దీనికి సంబంధించిన విధి,విధానాలను తూచ తప్పకుండా అమలుచేస్తూ మే, జూన్ కల్లా పూర్తి చేయాలని, 3.5 లక్షల యూనిట్ల గొర్రెలను పంపిణీ చేయాలన్నారు.

పోడు భూముల పంపిణీ

ప్రభుత్వం పోడు భూముల పంపిణీ త్వరలో ప్రారంభిస్తుందని, అర్హులకు అందరికీ న్యాయం జరిగేలా చూసుకుంటూ ఈ పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యేలు జాగ్రత్తగా జరిపించాల్సిన అవసరం ఉందని కెసిఆర్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News