మిలిటరీ జుంటా తీర్పు వెల్లడి
యాంగోన్ : ఈ ఏడాది ఫిబ్రవరిలో మయన్మార్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేపట్టి అధికారాన్ని చేజిక్కించుకున్న అక్కడి సైన్యం ఆంగ్సాన్ సూకీ సహా అనేక మంది నేతలను నిర్బంధించిన విషయం తెలిసిందే. వారిపై అవినీతి, ఎన్నికల్లో మోసాలు, తదితర అభియోగాలు మోపి విచారణ చేపడుతోంది. ఈ క్రమం లోనే దేశ సైన్యానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టడంతోపాటు కొవిడ్ మార్గదర్శకాలను ఉల్లంఘించినందుకు గాను సూకీకి సోమవారం మిలిటరీ జుంటా నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది. సైన్యానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టినందుకు రెండేళ్లు, కొవిడ్కు సంబంధించిన ప్రకృతి విపత్తు చట్టాన్ని ఉల్లంఘించినందుకు మరో రెండేళ్ల జైలు శిక్ష విధించినట్టు జుంటా ప్రతినిధి జా మిన్ తున్ తెలిపారు.
మాజీ అధ్యక్షుడు విన్ మైంట్కు సైతం ఇవే అభియోగాలపై నాలుగేళ్ల శిక్ష పడింది. అయితే వారిని ఇంకా జైలుకు తరలించలేదని, మరిన్ని అభియోగాలపై విచారణ చేపట్టనున్నట్టు చెప్పారు. వీటిలో దోషిగా తేలితే వారికి దశాబ్దాల పాటు శిక్షపడే అవకాశం ఉంది. మరోవైపు హక్కుల పరిరక్షణ సంస్థ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఈ శిక్షలను ఖండించింది. తప్పుడు ఆరోపణలపై సూకీకి విధించిన శిక్ష, స్థానికంగా వ్యతిరేకతలను నిర్మూలించేందుకు సైన్యం తీసుకుంటున్న చర్యలకు ఉదాహరణ అని సంస్థ క్యాంపెయిన్స్ డిప్యూటీ రీజినల్ డైరెక్టర్ మింగ్ యు హా అన్నారు. ఇంటర్నేషనల్ క్రైసిస్ గ్రూప్ మయన్మార్ సీనియర్ సలహాదారు రిచర్డ్ హార్సే కూడా దీన్ని ప్రతీకార చర్యగా అభివర్ణించారు. మిలిటరీ అధికార ప్రదర్శనకు నిదర్శనమని అన్నారు.