అడిలైడ్: ఇంగ్లండ్తో జరిగిన రెండో యాషెస్ టెస్టు మ్యాచ్లో ఆతిథ్య ఆస్ట్రేలియా 275 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. సోమవారం చివరి రోజు ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్లో 192 పరుగులకు ఆలౌటైంది. ఆస్ట్రేలియా బౌలర్లు వరుస క్రమంలో వికెట్లు పడగొడుతూ ఇంగ్లండ్ ఇన్నింగ్స్ను తక్కువ పరుగులకే కుప్పకూల్చారు. మ్యాచ్ను డ్రాగా ముగించేందుకు ఇంగ్లండ్ బ్యాటర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. మారథాన్ ఇన్నింగ్స్ ఆడిన వికెట్ కీపర్ జోస్ బట్లర్ 207 బంతుల్లో 26 పరుగులు చేశాడు. మరోవైపు క్రిస్ వోక్స్ 44 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. కాగా, డిఫెన్స్తో అలరించిన బెన్ స్టోక్స్ 77 బంతుల్లో 12 పరుగులు చేశాడు. మిగతా బ్యాటర్లు కూడా చాలా సేపటి వరకు క్రీజులో నిలిచినా జట్టును ఓటమి నుంచి రక్షించలేక పోయారు. ఇక ఆస్ట్రేలియా బౌలర్లలో రిచర్డ్సన్ ఐదు, స్టార్క్, లియాన్ రెండేసి వికెట్లు పడగొట్టారు. ఈ విజయంతో ఆస్ట్రేలియా సిరీస్లో 20 ఆధిక్యాన్ని అందుకుంది.