హైదరాబాద్: భారీవర్షాలు, వరదల వల్ల హైదరాబాద్ పరిధిలోని చెరువులకు ప్రమాదం జరగకుండా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సిఎం కెసిఆర్ ఆదేశించారు. కనీసం 15 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి, నగరంలోని అన్ని చెరువుల పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, అవసరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. బుధవారం ఉదయం నీటిపారుదల ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్ తో సిఎం సమీక్షించారు. హైదరాబాద్ లో గత వందేళ్లలో ఎన్నడూ లేని విధంగా భారీ వర్షాలు కురిశాయన్నారు. దీంతో నగరంలో భారీగా వరద నీరు చేరిందని చెప్పారు. నగర వరద నీరుతో పాటు చుట్టు పక్కల ప్రాంతాల్లోని చెరువుల ద్వారా కూడా హైదరాబాద్ చెరువులకు నీరు చేరిందని ఆయన పేర్కొన్నారు. దీంతో చెరువులన్నీ నిండిపోయాయని తెలిపారు. రానున్న రెండు, మూడ్రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించిన నేపథ్యంలో అధికార యంత్రాంగ్రం చెరువుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సిఎం ఆదేశించారు. చెరువు కట్టలు తెగే అవకాశమున్న చోట, గండ్లు పడే అవకాశం ఉన్న చోట వరద నీటి ప్రభావానికి గురయ్యే ప్రజలను అప్రమత్తం చేసి, ఎప్పటికప్పుడు మరమ్మతులు చేపట్టాలని సిఎం ఆదేశించారు.
Authorities Should be Vigilant Says CM KCR