Friday, April 26, 2024

అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణను తెలంగాణ హైకోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది. ఉదయం నుంచి ఇతర కేసుల విచారణలో వేకెషన్ బెంచ్ బిజీగా ఉంది. అవినాష్ రెడ్డి పిటిషన్ 70 వ నెంబర్ తర్వాత రిజిస్టర్ కావడంతో సాయంత్రం వరకూ విచారణకు రాలేదు. విచారణకు వచ్చిన తర్వాత వాదనలకు ఎంత సమయం పడుతుందని ఇరు వర్గాల న్యాయవాదుల్ని న్యాయమూర్తి ప్రశ్నించారు. తమకు గంట సమయం కావాలని సిబిఐ తరపు న్యాయవాదులు ధర్మాసనానికి వివరించారు. దీంతో శుక్రవారం ఉదయం పదిన్నరకు వాదనలు వింటామని హైకోర్టు తెలిపింది. వాయిదా వేసింది.

అవినాష్ రెడ్డి ముంందస్తు బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో జస్టిస్ జె కే మహేశ్వరి, జస్టిస్ పి. నరసింహ ధర్మాసనం విచారణ జరిపి, ముందస్తు బెయిల్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ విచారణ చేయాలని రెండు రోజుల కిందట ఆదేశించింది. తన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ కోరే హక్కు పిటిషనర్‌కు ఉందని సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. అవినాష్ రెడ్డి తన పిటిషన్‌లో ముందస్తు బెయిల్‌పై హైకోర్టు విచారణ జరిపే వరకు కస్టడీ నుంచి రక్షణ కల్పించాలని కోరారు. లేదంటే, ముందస్తు బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు వెకేషన్ బెంచ్ విచారణ జరిపి పరిష్కరించే వరకు అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలని పిటిషన్‌లో అభ్యర్థించారు. కాగా, వివేకా హత్య కేసులో వారం రోజులుగా నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ నెల 19న విచారణకు రావాలని వైఎస్ అవినాష్ రెడ్డికి సిబిఐ నోటీసులు జారీ చేసింది.

దీంతో ఎంపీ విచారణకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. కానీ చివరి నిమిషంలో ఎంపి తల్లి అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన విషయం తెలియడంతో హుటాహుటిన హైదరాబాద్ నుంచి పులివెందుల బయల్దేరి వెళ్లారు. అవినాష్ రెడ్డి తల్లిని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించే ప్రయత్నం చేయగా ఆమె ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో కర్నూలు విశ్వభారతి ఆస్పత్రికి తరలించారు. అవినాష్ రెడ్డి కూడా అక్కడే ఉండి చూసుకుంటున్నారు. ఈ క్రమంలో సిబిఐ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 21న విచారణకు రావాలని పేర్కొంది. కానీ తన తల్లి అనారోగ్యంతో ఆస్పత్రిలో ఉన్నారని తాను బాగోగులన్నీ చూసుకోవాలని సిబిఐకి అవినాష్ రెడ్డి లేఖ రాశారు. తనకు మరో వారం పాటూ గడువు ఇవ్వాలని కోరారు. సిబిఐ ఈ లేఖపై ఎలాంటి సమధానం ఇవ్వలేదు. కానీ అవినాష్ రెడ్డి మాత్రం న్యాయపరంగా తన ప్రయత్నాలు తాను చేస్తున్నారు.

ఇదిలా ఉండగా, ఎంపి అవినాష్ రెడ్డి తల్లి శ్రీలక్ష్మి ఆరోగ్య పరిస్థితి కుదుట పడిందని కర్నూలు విశ్వభారతి ఆస్పత్రి వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. శ్రీలక్ష్మి ఆరోగ్య పరిస్థితిలో పురోగతి ఉందని వైద్యులు తెలిపారు. వాంతులు తగ్గాయని ఐసియు నుంచి సాధారణ గదికి తరలించడానికి ప్లాన్ చేస్తున్నామని హెల్త్ బులెటిన్‌లో తెలిపారు. ఆరు రోజుల నుంచి అవినాష్ రెడ్డి తల్లి విశ్వభారతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వైఎస్ అవినాష్ రెడ్డి కూడా ఆస్పత్రిలోనే ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News