Wednesday, April 24, 2024

ఇరుముడిని క్యాబిన్ లగేజీలో తీసుకెళ్లొచ్చు..

- Advertisement -
- Advertisement -

 

మనతెలంగాణ/హైదరాబాద్: విమాన ప్రయాణం చేసే అయ్యప్ప భక్తులకు బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ వెసులుబాటు కల్పించింది. భక్తులు సంప్రదాయంగా తీసుకెళ్లే ఇరుముడిని క్యాబిన్ లగేజీలో తీసుకువెళ్లేందుకు అనుమతించింది. ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల అయ్యప్ప దర్శనానికి విమానంలో వెళ్లే భక్తులకు ఈ ప్రత్యేక అనుమతిని కల్పించింది. అన్ని తనిఖీల తర్వాత అయ్యప్ప భక్తులు తీసుకెళ్లె ఇరుముడిని క్యాబిన్‌లోకి అనుమతించాలని అన్ని విమానాశ్రయాల భద్రతా సిబ్బందికి మార్గదర్శకాలు జారీ చేసింది.

వచ్చే ఏడాది జనవరి 20వ తేదీ వరకు విమానాల్లో శబరిమల వెళ్లే భక్తులకు వెసులుబాటు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మండలం, మకరజ్యోతి దీక్షలు పూర్తయ్యే వరకు మాత్రమే ఈ అవకాశం ఉంటుందని స్పష్టం చేసింది. అంతకుముందు విమాన ప్రయాణాల్లో ఇరుముడిని తీసుకువెళ్లడానికి అనుమతి ఇచ్చేవారు కాదు. ప్రస్తుతం ఇచ్చిన వెసులుబాటుతో అనేక మంది భక్తులకు శబరిమల విమాన ప్రయాణం సులభం కానుంది.

నెయ్యితో నింపిన కొబ్బరికాయని దేవుడికి సమర్పించేందుకు….

మండల పూజల కోసం శబరిమల అయ్యప్పస్వామి ఆలయం నవంబర్ 16వ తేదీన తెరుచుకుంది. కరోనా సంబంధిత ఆంక్షలను ఉపసంహరించిన తర్వాత జరుగుతున్న తొలి మండల పూజ ఇదే కావడం విశేషం. 41 రోజుల పాటు జరిగే మండల పూజ డిసెంబర్ 27న ముగుస్తుంది. మధ్యలో విరామం ఇచ్చి డిసెంబర్ 30న మకరజ్యోతి కోసం ఆలయాన్ని మళ్లీ తెరుస్తారు. అయ్యప్ప మాల వేసుకునే భక్తులు సంప్రదాయం ప్రకారం ఇరుముడిని కడతారు. నెయ్యితో నింపిన కొబ్బరికాయని దేవుడికి సమర్పించేందుకు శబరిమల తీసుకువెళతారు. అలా ఇరుముడిని కట్టిన భక్తులకు మాత్రమే పవిత్రమైన 18 మెట్లను ఎక్కే అవకాశాన్ని కల్పిస్తారు. మిగిలిన భక్తులను ప్రత్యేక మార్గంలో దర్శనానికి అనుమతిస్తారు.

దర్శన సమయాన్ని పొడిగించిన బోర్డు

మండల దీక్షలో భాగంగా శబరిమల అయ్యప్ప దేవస్థానానికి భక్తులు తాకిడి ఎక్కువైంది. దీంతో దర్శన సమయాన్ని ట్రావెన్‌కోర్ బోర్డు పెంచింది. మధ్యాహ్నం 4 గంటలకు బదులు 3 గంటలకే ఆలయాన్ని ప్రారంభించాలని నిర్ణయించింది. ఇంతకుముందు ఉదయం 3 గంటల నుంచి ఒంటి గంట వరకు, తిరిగి మధ్యాహ్నం 4 గంటల నుంచి అర్ధరాత్రి వరకు దర్శనానికి అనుమతి ఇచ్చింది. సోమవారం ఒక్కరోజే 70 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News