మన తెలంగాణ/హైదరాబాద్ : లాక్డౌన్ వేళ అత్యవసరం తప్పించి ప్రజలెవరూ బయటికి తిరగకుండా పోలీసులు కఠిన చర్యలు చేపడుతున్నా కొందరు మాత్రం పొంతనలేని కారణాలు చెబుతూ యధేచ్ఛగా రోడ్లపై తిరుగాడుతున్నారు. మాస్క్లు లేకుండా తిరిగితే కఠిన చర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరించినా పలువురు మాస్క్లు ధరించకుండానే రోడ్లెక్కిస్తున్నారు. ప్రభుత్వ హెచ్చరికలను ఎవరూ పట్టించుకోవడం లేదు. మాస్క్ లేకుండా తిరగడమే కాదు… ఎందుకిలా తిరుగుతున్నావ్ అని అడిగిన పోలీసులను తిడుతున్నారు. ఈ క్రమంలో ఇలా పోలీసులు, అధికారులతో అనుచితంగా వ్యవహరించిన వారిని కటాకటాల్లోకి నెడుతున్నారు. సంగారెడ్డి జిల్లాలో తాజాగా ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది.
సంగారెడ్డి జిల్లాలో అజహర్ అనే యువకుడు శుక్రవారం మాస్క్ లేకుండా రోడ్డుపై తిరగడంతో.. రెవెన్యూ సిబ్బంది మాస్క్ లేకుండా ఎందుకు తిరుగుతున్నావ్ అని అజహర్ని ప్రశ్నించారు. తననే ప్రశ్నిస్తారా? అని అజహర్ సదరు రెవెన్యూ సిబ్బందిపై బూతుల వర్షం కురిపించాడు. దీంతో ఈ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకున్న రెవెన్యూ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెనువెంటనే రంగంలోకి దిగిన పోలీసులు అజహర్ని శనివారం రాత్రి అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఇటువంటి చర్యలకు ఎవరూ పాల్పడినా కఠిన చర్యలు తప్పవని పోలీసులు, అధికారులు హెచ్చరిస్తున్నారు.