హైదరాబాద్: టాలీవుడ్ అగ్రహీరో నందమూరి బాలకృష్ణ తెలంగాణ సిఎం కెసిఆర్కు ధన్యవాదాలు తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి, తన తండ్రి ఎన్టీర్ జీవితాన్ని పాఠ్యపుస్తకాల్లో చేర్చడంపై హర్షం వ్యక్తపర్చారు. ఈ మేరకు ఫేస్బుక్లో బాలకృష్ణ స్పందించారు. పుస్తకంలోని పాఠ్యాంశాలకకు సంబంధించిన పేజీల ఫోటోలను కూడా బాలకృష్ణ షేర్ చేశారు. “కళకి, కళాకారులకు విలువను పెంచిన కథనాయకుడు, తెలుగోడి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ పీఠాన్ని కదిలించేలా వినిపించిన మహానాయకుడు, ఎన్నో సాహసోపేతమైన ప్రజారంజక నిర్ణయాలతో ప్రజల ముంగిటకే ప్రభుత్వాన్ని తెచ్చిన ప్రజా నాయకుడు, మదరాసీయులమనే పేరును చెరిపి భారతదేశపటంలో తెలుగువాడికి, తెలుగు వేడికి ఒక ప్రత్యేకతని తెచ్చిన తెలుగుజాతి ముద్దుబిడ్డ, అన్నగారు, మా నాన్నగారు నందమూరి తారకరామారావు గురించి భావితరాలకు స్ఫూర్తినిచ్చేనలా 10వ తరగతి సాంఘిక శాస్త్రంలో పాఠ్యాంశముగా చేర్చిన తెలంగాణ ప్రభుత్వానికి, తెలంగాణ సిఎం కెసిఆర్కి నా హృదయపూర్వక ధన్యావాదాలు” అని అన్నారు నందమూరి బాలకృష్ణ.
కాగా, పదో తరగతి సాంఘిక శాస్త్రంలోని 268 పేజీలో ఎన్టీఆర్ పాఠ్యాంశాన్ని ముద్రించారు. జాతీయ కాంగ్రెస్ నాయకత్వం నుంచి తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి అవమానం జరిగిందని భావించిన ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారని.. పేదలకు రూ.2కే కిలో బియ్యం, మధ్యాహ్నం భోజన పథకం, మద్యపాన నిషేధం వంటి పేదల సంక్షేమ పథకాలను తీసుకొచ్చారని, ఎన్టీఆర్ జీవిత చరిత్రకు సంబంధించిన విశేషాలను పాఠ్యాంశంలో పేర్కొన్నారు. ఎన్టీఆర్ విదేశాలకు వెళ్లినప్పుడు జరిగిన నాదెండ్ల భాస్కరరావు తిరుగుబాటు ఎపిసోడ్ను కూడా పాఠ్యాంశంలో ప్రస్తావించారు.