Friday, March 29, 2024

ఆకాశ భవనంపై బతుకమ్మ

- Advertisement -
- Advertisement -
Bathukamma screening at Burj Khalifa Dubai
ఎంఎల్‌సి, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో ప్రపంచంలోనే అతి ఎత్తైన సౌధం దుబాయ్‌లోని బుర్జు ఖలీఫా స్క్రీన్‌పై ప్రదర్శన, ముఖ్యమంత్రి కెసిఆర్ చిత్రపటాన్ని చూపిన విశిష్ట ఘట్టం

మన తెలంగాణ/హైదరాబాద్ : బతుకమ్మ ఖ్యాతి ఖండాంతరాలు దాటింది. ఎడారి దేశంలో తంగేడు వనం విరబూసింది. తెలంగాణ సాంస్కృతిక చిహ్నం బతుకమ్మను విశ్వవేదికపై సగర్వంగా ప్రదర్శించారు. ఎంఎల్‌సి, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత శనివారం దుబాయ్‌లోని బూర్జ్ ఖలీఫాపై బతుకమ్మ పండుగ వీడియోను ప్రదర్శించి బతుకమ్మ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు. బతుకమ్మ వీడియోను బూర్జ్ ఖలీఫా తెరపై రెండు సార్లు ప్రదర్శించారు. మూడేసి నిమిషాల నిడివి గల ఈ వీడియోల్లో బతుకమ్మ విశిష్టత, తెలంగాణ సంస్కృతిని అద్భుతంగా ఆవిష్కరించారు. అంతేకాదు ముఖ్యమంత్రి కెసిఆర్ చిత్రపటాన్ని సైతం బూర్జ్ ఖలీఫా స్క్రీన్‌పై ప్రదర్శించారు. రంగు రంగుల పూలతో అలంకరించిన బతుకమ్మ బూర్జ్ ఖలీఫాపై కనిపించగానే కార్యక్రమానికి హాజరైన ప్రవాస తెలంగాణ వాసులు పులకించిపోయారు. యూఏఇ ప్రభుత్వ ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, వివిధ దేశాలకు చెందిన లక్షలాది మంది బతుకమ్మ పండుగ వీడియోలను ఎంతో ఆసక్తిగా తిలకించారు. బూర్జ్ ఖలీఫాపై బతుకమ్మను ప్రదర్శించడం మన రాష్ట్రానికే గాక దేశానికి సైతం గర్వకారణమని ఎంఎల్‌సి కవిత తెలిపారు.

బూర్జ్ ఖలీఫాపై బతుకమ్మను ప్రదర్శించడం చరిత్రలో నిలిచిపోతుందని చెప్పారు. ఇందుకు సహకరించిన యూఏఇ ప్రభుత్వానికి, బూర్జ్ ఖలీఫా నిర్వాహకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గత పుష్కరకాలంగా బతుకమ్మ పండుగను ప్రతీ ఏటా పెద్ద ఎత్తున ఎంఎల్‌ఎ కవిత నిర్వహిస్తున్నారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం సందర్భంగా తెలంగాణ జాగృతిని ప్రారంభించిన ఎంఎల్‌సి కవిత, బతుకమ్మ పండుగ ద్వారా ఉద్యమంలో ప్రజలను భాగస్వాములను చేశారు. పువ్వులను పూజించే విశిష్ట సంప్రదాయాన్నీ ప్రతి ఏటా ఊరు వాడా ఘనంగా జరుపుకునేందుకు ఎంఎల్‌సి కవిత ఎంతగానో కృషి చేస్తున్నారు. రాష్ట్ర ఏర్పాటు అనంతరం బతుకమ్మ పండుగను తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో దేశ విదేశాల్లో సైతం తెలంగాణ ఆడబిడ్డలంతా గొప్పగా జరుపుకుంటున్నారు. ఇక ఈ ఏడాది బతుకమ్మ పండుగ మరింత ప్రత్యేకం. బతుకమ్మ ఖ్యాతిని ప్రపంచమంతటా చాటి చెప్పేందుకు నడుం బిగించినట్లు ప్రకటించిన ఎంఎల్‌సి కవిత అందులో భాగంగా ప్రతీ ఏటా సరికొత్త విధంగా బతుకమ్మ పండుగ కార్యక్రమాలు రూపొందించనున్నట్లు తెలిపారు.

ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్, ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ ఆధ్వర్యంలోని ఈ ఏడాది బతుకమ్మ పాటను రూపొందించారు. శనివారం దుబాయ్‌లోని బూర్జ్ ఖలీఫాపై బతుకమ్మను ప్రదర్శించడంతో తెలంగాణ పూల పండుగ మరోసారి మన దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కార్యక్రమంలో ఎంపి సురేష్‌రెడ్డి, టిఎస్‌ఆర్టిసి చైర్మన్‌బాజిరెడ్డి గోవర్ధన్, ఎంఎల్‌ఎలు షకీల్ అహ్మద్, జీవన్‌రెడ్డి, జాజుల సురేందర్, డాక్టర్ సంజయ్, బిగాల గణేష్ గుప్తా, తెలంగాణ జాగృతి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి, తెలంగాణ జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజీవ్ సాగర్, దాస్యం విజయ్ భాస్కర్, యూఏఇ ప్రభుత్వ ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, ప్రవాస తెలంగాణ వాసులు పాల్గొన్నారు.

అంతకు ముందు ప్రవాస తెలంగాణ బిడ్డలు, టిఆర్‌ఎస్ నాయకులు, తెలంగాణ సంఘాలు, జాగృతి ప్రతినిధులు ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలోని బృందానికి ఘన స్వాగతం పలికారు. దుబాయ్ వీధుల్లో భారీ ర్యాలీతో ప్రవాస తెలంగాణ వాసులు స్వాగతం పలికారు. ఈ సందర్బంగా జై తెలంగాణ, జై కెసిఆర్ నినాదాలు మార్మోగాయి. బతుకమ్మ పండుగ తెలంగాణ సంప్రదాయ పండుగ. దసరా వేళ తెలంగాణలో జరుపుకున్న అతి పెద్ద పండుగ. తెలంగాణ సంప్రదాయాన్ని ప్రతిబింబించే పండుగ. పూలనే దేవతలుగా కొలిచే విశిష్ట సంప్రదాయం కలిగిన పండుగ. ఇప్పుడు బతుకమ్మ అంతర్జాతీయ వేదికకు ఎక్కింది. దుబాయ్ వేదికగా ప్రపంచ దృష్టిని ఆకర్షించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News