ముంబయి: సొంత గడ్డపై దక్షిణాఫ్రికాతో జరగనున్న మూడు వన్డేల సిరీస్ కోసం భారత జట్టును బిసిసిఐ ప్రకటించింది. ఆదివారం ఇక్కడ సమావేశమైన సెలెక్టర్లు విరాట్ కోహ్లీ సారథ్యంలో 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించారు. గాయం కారణంగా కొంతకాలంగా జట్టుకు దూరమైన ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య సఫారీల సిరీస్తో పునరాగమనం చేయనున్నాడు. వెన్నుగాయం కారణంగా హార్దిక్ గత కొన్ని నెలలుగా విశ్రాంతి తీసుకుంటున్న విషయం తెలిసిందే. అయితే డివై పాటిల్ టి20టోర్నీలో సూపర్ ఫామ్తో సత్తా చాటిన హార్దిక్కు జట్టులో స్థానం కల్పించారు. హార్దిక్తో పాటుగా గాయం కారణంగా న్యూజిలాండ్ పర్యటనకు దూరమైన ఓపెనర్ శిఖర్ ధావన్ కూడా జట్టులో తిరిగి స్థానం పొందాడు. గాయంనుంచి కోలుకుంటున్న రోహిత్ శర్మకు సెలెక్టర్లు విశ్రాంతి కల్పించారు.
బ్యాకప్ ఓపెనర్లుగా పృథ్వీషా, శుభ్మన్గిల్లను ఎంపిక చేశారు. ఇక ఎన్నో ఆశలు పెట్టుకున్న కీపర్ సంజూ శాంసన్కు మరోపారి నిరాశే మిగిలింది. రిషబ్ పంత్ వైపే సెలెక్టర్లు మొగ్గు చూపారు. కాగా గత కొంతకాలంగా నిలకడగా రాణిస్తున్న కెఎల్ రాహుల్, మనీష్ పాండే, శ్రేయస్ అయ్యర్లుతమ స్థానాలను పదిలంగా నిలబెట్టుకున్నారు. కాగా బౌలర్లలో భువీ జట్టులోకి వచ్చి చేగా, మహమ్మద్ షమీ తన స్థానాన్ని నిలబెట్టుకోలేకపోయాడు.స్పిన్ ద్వయం, చాహల్, కుల్దీప్లనే ఈ సిరీస్కు కూడా ఎంపిక చేశారు. సీనియర్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజాను కూడా సఫారీ సిరీస్కు ఎంపిక చేశారు. కాగా, దక్షిణాఫ్రికా తన పర్యటనలో మార్చి 12, 15, 18 తేదీల్లో టీమిండియాతో మూడు వన్డే మ్యాచ్లు ఆడుతుంది.