ముంబై: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) చైర్మన్ పదవిలో భారత క్రికెట్ బోర్డు అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఉన్నట్టు వస్తున్న వార్తలను బిసిసిఐ ఖండించింది. ఈ మేరకు బిసిసిఐ కోశాధికారి అరుణ్ ధుమాల్ స్పష్టమైన ప్రకటన విడుదల చేశారు. బిసిసిఐ అధ్యక్ష పదవిలో ఉన్న వ్యక్తి ఐసిసి చైర్మన్ పదవికి పోటీ చేయడం నిబంధనలకు విరుద్ధమని, ఈ విషయంలో వస్తున్న వార్తలన్ని నిరాధారమైనవని కొట్టి పారేశారు. దీనిపై కొందరూ కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని ధుమాల్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక, ఐసిసి చైర్మన్ పదవికి బిసిసిఐ తరఫున ఎవరినైనా బరిలోకి దించాలా వద్దా అనే దానిపై ఇంత వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. ఇక, తాము పోటీ చేయాలా లేకుంటే ఇతర దేశాల ప్రతినిధులకు మద్దతు ఇవ్వాలా అనే దానిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు.
ఇక, ఐసిసి చైర్మన్ పదవిపై గంగూలీ ఆసక్తి కనబరుస్తున్నట్టు దానికి తాము మద్దతు ఇచ్చేందుకు సిద్ధమేనని సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు చేసిన ప్రకటనను కూడా ధుమాల్ కొట్టి పారేశారు. అసలు గంగూలీ పోటీలోనే లేనప్పుడూ అతనికి మద్దతు ఎలా అందిస్తారని ప్రశ్నించారు. ఇదిలావుండగా ప్రస్తుతం ఐసిసి చైర్మన్గా ఉన్న శశాంక్ మనోహర్ పదవి కాలం జులైలో ముగియనుంది. రెండు పర్యాయాలు చైర్మన్గా వ్యవహరించిన శశాంక్ పదవి మే నెలలోనే ముగిసింది. అయితే కరోనా నేపథ్యంలో ఆయన పదవి కాలాన్ని రెండు నెలల పాటు పొడిగించారు. కాగా, జులైలో ఐసిసి చైర్మన్ పదవికి ఎన్నికలు జరుగనున్నాయి.