ముంబై: ఆస్ట్రేలియా వేదికగా ఈ ఏడాది జరగాల్సిన ట్వంటీ20 ప్రపంచకప్ వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ ఏడాది వరల్డ్కప్ లేక పోవడంతో ప్రతిష్టాత్మకమైన ఐపిఎల్ నిర్వహణకు మార్గం సుగమం అయ్యింది. అయితే ప్రస్తుతం భారత్లో కరోనా విజృంభిస్తుండడంతో ఐపిఎల్ వంటి మెగా టోర్నమెంట్ను నిర్వహించడం కష్టంగా మారింది. ఈ పరిస్థితుల్లో విదేశాల్లో ఐపిఎల్ నిర్వహించేందుకు తమకు అనుమతి ఇవ్వాలని భారత క్రికెట్ బోర్డు(బిసిసిఐ) కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఐపిఎల్ చైర్మన్ బ్రిజేష్ పటేల్ మంగళవారం కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. దేశంలో కరోనా తీవ్రత అధికంగా ఉన్నందున ఐపిఎల్ను విదేశాల్లో నిర్వహించాలని నిర్ణయించాం. సెప్టెంబర్నవంబర్ మధ్యలో ఐపిఎల్ షెడ్యూల్ ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని ఆ లేఖలో పేర్కొన్నారు.కరోనా తీవ్రత తక్కువగా ఉన్న యుఎఇలో ఈ ఏడాది ఐపిఎల్ను నిర్వహించాలనే యోచనలో తామున్నట్టు తెలిపారు. కాగా, విదేశీ గడ్డపై ఐపిఎల్ను నిర్వహించేందుకు ప్రభుత్వం అనుమతి మంజూరు చేయాలని కోరుతున్నాం అని బ్రిజేష్ ఆ లేఖలో పేర్కొన్నారు.
ప్రయత్నాలు ముమ్మరం
ఇదిలావుండగా ఈ ఏడాది ఎలాగైన ఐపిఎల్ను నిర్వహించాలనే పట్టుదలతో ఉన్న భారత క్రికెట్ బోర్డు తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఇప్పటికే ఫ్రాంచైజీల యాజమాన్యాలు కూడా యుఎఇలో ఐపిఎల్ నిర్వహణకు అంగీకారం తెలిపాయి. అంతేగాక క్రికెటర్లకు వసతి సౌకర్యాలు కల్పించేందుకు ఏర్పాట్లు ప్రారంభించాయి. దీంతోపాటు ఆటగాళ్ల తరలింపు కోసం ప్రత్యేక విమానాలను ఉపయోగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. మరోవైపు ఆటగాళ్లు కూడా విదేశాల్లో ఐపిఎల్ ఆడేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే భారత్తో పాటు విదేశాలకు చెందిన క్రికెటర్లు ఈ విషయాన్ని స్పష్టం చేశారు. దీంతో ఈ ఏడాది ఐపిఎల్ నిర్వహణకు ఎలాంటి ఆటంకం లేకుండా పోయింది. ఇక, ప్రపంచకప్ను వాయిదా వేస్తున్నట్టు అంతర్జాతీయ క్రికెట్ మండలి అధికారికంగా ప్రకటించడంతో ఐపిఎల్ నిర్వహణకు ఉన్న అతి పెద్ద అడ్డంకి తొలగిపోయింది. ఈ పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకునేందుకు బిసిసిఐ ప్రత్యేక వ్యూహాలను రచిస్తోంది. దుబాయి వేదికగా ఐపిఎల్ను నిర్వహించాలని ప్రణాళికలు సిద్దం చేసింది. ఇందు కోసం ఇప్పటికే యుఎఇ క్రికెట్ బోర్డుతో ఒక ఒప్పందం కూడా కుదుర్చుకున్నట్టు తెలిసింది.
BCCI seeks Central Govt permission for IPL