Thursday, March 28, 2024

ఒకప్పుడు బీడీ కార్మికుడు.. నేడు అమెరికాలో న్యాయమూర్తి

- Advertisement -
- Advertisement -

హ్యూస్టన్: చదువుకునే రోజుల్లోనే కూలీగా అవతారం. పొట్ట నింపుకోవడానికి చదువుకుంటూనే బీడీలు చుట్టే పని. తోటి వారి సాయం చేయకపోతే చదువు కొనసాగించలేని పరిస్థితి. ఇదంతా గతం. సీన్ కట్ చేస్తే ..లాయర్‌గా మంచిపేరు. సుప్రీంకోర్టులో కూడా పని చేసిన అనుభవం.ఇప్పుడు అమెరికాలో జ్యుడీషియల్ కోర్టులో న్యాయమూర్తిగా నియామకం. అచ్చం సినిమా కథను తలపించే ఈ కథ సురేంద్రన్ పటేల్‌ది. కేరళకు చెందిన ఈయన ఇటీవలే అమెరికాలో జడ్జిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన జర్నీ గురించి ‘ ది వీక్’ మ్యాగజైన్ ఓ కథనం ప్రచురించింది. ఆ మ్యాగజైన్‌తో ఆయన అనేక విషయాలు పంచుకున్నారు. చిన్నతనంనుంచి అమెరికా వరకు సాగిన ప్రయాణాన్ని అందులో వివరించారు. సురేంద్రన్‌ది కేరళలోని కాసరగోడ్. ఇంటిల్లపాదీ పని చేస్తే తప్ప పూటగడవని స్థితి. దీంతో సురేంద్రన్ కూడా చిన్నతనంనుంచే పని చేసే వారు. సోదరితో కలిసి బీడీలు చుట్టేవారు. ఇతర కూలీ పనులు కూడా చేసే వారు.

ఇవన్నీ చేస్తూనే చదువుకునే వారు. అయితే పదో తరగతి పాసయిన తర్వాత చదువు మానేసి ‘భారత్ బీడీ’లో పూర్తిగా బీడీలు చుట్టేపనిలో నిమగ్నమయ్యారు. అలా ఏడాది గడిచిపోయింది. పని చేయడం వల్ల ఆదాయం వస్తున్నా చదువుకోలేకపోయానన్న వెలితి ఆయనను వేధిస్తూ ఉండేది. దీంతో చదువును తిరిగి కొనసాగించాలనే నిర్ణయానికి వచ్చారు. ఓ ప్రభుత్వ కళాశాలలో చేరారు. చదువుకుంటూనే కూలీ పనులకు వెళ్లే వారు. దీంతో ఎక్కువ రోజులు సెలవులు పెట్టేవారు. హాజరు తక్కువగా ఉన్నందున పరీక్షలకు అనుమతించేది లేదని కళాశాల యాజమాన్యం చెప్పింది. దీంతో అధ్యాపకులను బతిమాలుకోవడంతో చివరికి అనుమతించారని సురేంద్రన్ ఆ ఇంటర్వూలో చెప్పారు. అనూహ్యంగా ఆ పరీక్షలో ఆయనే టాపర్‌గా నిలిచారు. ఆ తర్వాత కాలికట్ గవర్నమెంట్ లా కాలేజిలో చేరారు. అప్పుడు కూడా ఆయనను ఆర్థిక ఇబ్బందులు వెంటాడాయి. స్నేహితుల సాయంతో మొదటి సంవత్సరం పూర్తి చేసిన సురేంద్రన్.. ఓ హోటల్‌లో పని చేస్తూ మిగిలిన చదువును పూర్తి చేశారు.1995లో లా డిగ్రీ పూర్తి చేసిన ఆయన 1996లో ప్రాక్టీస్ మొదలుపెట్టారు.

సుప్రీంకోర్టులోనూ ప్రాక్టీస్ చేశారు. సీనియర్ న్యాయవాదిగా కొన్ని కేసులు వాదించారు.2004లో శుభతో వివాహం జరిగింది. కొద్ది రోజులకే ఆమెను అమెరికాలో ఉద్యోగావకాశం వరించింది. దీంతో కుటుంబంతో కలిసి హ్యూస్టన్‌కు మారారు. ఆ తర్వాత అక్కడే స్థిరపడిపోయారు.అమెరికాకు వెళ్లిన రెండేళ్లకు టెక్సాస్‌లోని బార్ ఎగ్జామ్‌కు హాజరయ్యారు. తొలి ప్రయత్నంలోనే ఉత్తీర్ణులయ్యారు. తర్వాత అమెరికా చట్టాలను అర్థం చేసుకోవడానికి యూనివర్సిటీ ఆఫ్ హ్యూస్టన్ లా సెంటర్‌లో ఎల్‌ఎల్‌ఎం ప్రోగ్రామ్‌లో చేరారు. 2011లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. కుటుంబ, క్రిమినల్, కమర్షియల్ వంటి వ్యవహారాల కేసులను వాదించే వారు. ఆ తర్వాత సొంతంగా లా సంస్థను ఏర్పాటు చేశారు. అక్కడా మంచి లాయరుగా పేరుతెచ్చుకున్నారు. 2020లో డెమోక్రటిక్ పార్టీనుంచి జడ్జి పదవికోసం జరిగిన ఎన్నికల్లో ఓడిపోయారు. అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో మాత్రం విజయం సాధించారు. డిస్ట్రిక్ట్ జడ్జిగా ఎన్నికయ్యారు. ప్రజలకు న్యాయం కలుగుతుందన్న విశ్వాసం కోర్టుల ద్వారా కలిగినప్పుడే న్యాయవ్యవస్థకు ఓ అర్థం ఉంటుందని సురేంద్రన్ అంటారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News