లండన్: చారిత్రాత్మక యాషెస్ సిరీస్కు ముందు ఇంగ్లాండ్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్రౌండర్ బెన్స్టోక్స్ చేతి వేలికి మరో సర్జరీ జరగడంతో యాషెస్ సిరీస్నుంచి తప్పుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది భారత్లో జరిగిన ఐపిఎల్ 2021 తొలి దశ సందర్భంగా స్టోక్స్ గాయపడ్డాడు. ఆ సమయంలో అతను గాయానికి సర్జరీ చేయించుకున్నాడు. అయితే తాజాగా అదే చేతి వేలికి మరో సర్జరీ జరగడంతో అతను యాషెస్ సిరీస్నుంచి తప్పుకుంటాడని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం స్టోక్స్ పూర్తి ఫిట్గా ఉన్నా ఇప్పట్లో క్రికెట్ ఆడే అవకాశం లేదని ఓ నివేదిక వెల్లడించింది. స్టోక్స్ సైతం ఈ విషయాన్ని సూచనప్రాయంగా అంగీకరించాడు.
బుధవారం తన ఇన్స్టాగ్రామ్లో ఓ ఫొటోను పోస్టు చేయగా, అందులో అతను చేతి వేలికి బ్యాడేజ్తో కనిపించాడు. ఈ ఫొటోలో స్టోక్స్ భార్య క్లేర్ కూడా ఉంది. కాగా స్టోక్స్.. ఐపిఎల్లో గాయం తర్వాత మానసిక సమస్యల కారణంగా భారత్తో టెస్టు సిరీస్, ఐపిఎల్ రెండో ఫేజ్, టి20 ప్రపంచకప్ వంటి మెగా టోర్నీలకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా ఆస్ట్రేలియా వేదికగా జరిగే యాషెస్ సిరీస్కు ఇంగ్లండ్ జట్టు సిద్ధమైనట్లు ప్రముఖ వార్తాసంస్థ వెల్లడించింది. కరోనా కఠిన ఆంక్షలను సడలించడానికి ఆస్ట్రేలియా అంగీకరించడంతో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ( ఇసిబి) ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే స్టార్ ఆటగాళ్లు జోస్ బట్లర్, బెన్స్టోక్స్ ఈ సిరీస్కు దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. ఆసీస్ ఇంగ్లండ్ మధ్య డిసెంబర్ 8నుంచి జనవరి 18 దాకా యాషెస్ సిరీస్ జరగనుంది.