రోమ్: భారత స్టార్ రెజ్లర్ భజరంగ్ పునియా మాటియో పెలికొన్ ర్యాంకింగ్ సిరీస్ పోటీల్లో స్వర్ణం సాధించాడు. 65 కిలోల విభాగం ఫైనల్లో భజరంగ్ మంగోలియా రెజ్లర్ తుల్గా తుమర్ ఒచిర్ను ఓడించాడు. ఒక దశలో 02తో వెనుకంజలో ఉన్న పునియా కీలక సమయంలో పుంజుకున్నారు. ఆఖరి 30 సెకన్లలో రెండు పాయింట్లు సాధించి స్కోరును సమం చేశాడు. నిబంధనల ప్రకారం ఆఖర్లో పాయింట్లు సాధించిన వారికే వితేతగాప్రకటిస్తారు. దీంతో ఆఖరి క్షణాల్లో పాయింట్లను సాధించిన పునియా తన ఖాతాలో స్వర్ణం వేసుకున్నాడు. ఇదే క్రమంలో 65 కిలోల విభాగంలో తిరిగి ప్రపంచ నంబర్వన్ ర్యాంక్ను సొంతం చేసుకున్నాడు.
కరోనా వైరస్ కారణంగా భజరంగ్ ఏడాది పాటు రెజ్లింగ్కు దూరమయ్యాడు. తాజాగా బరిలోకి దిగిన మొదటి టోర్నమెంట్లోనే స్వర్ణం సాధించి సత్తా చాటాడు. రానున్న టోక్యో ఒలింపిక్స్ను దృష్టిలో పెట్టుకుని ప్రపంచంలోనూ ప్రముఖ రెజ్లర్లందరూ ఈ టోర్నీలో బరిలోకి దిగారు. ఇందులో రెండో ర్యాంక్తో సిరీస్లో అడుగు పెట్టిన భజరంగ్ పునియా స్వర్ణంతో పాటు నంబర్వన్ ర్యాంక్ను సొంతం చేసుకుని ప్రకంపనలు సృష్టించాడు. ఇదిలావుండగా ఈ టోర్నీలో భారత్కు మొత్తం ఏడు పతకాలు లభించాయి.