న్యూఢిల్లీ : భారత్ అంతరిక్ష యాత్ర చంద్రయాన్3 వాయిదా పడింది. 2022 లో దీన్ని చేపడతామని భారత అంతరక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చీఫ్ కె. శివన్ వెల్లడించారు. చంద్రయాన్ 3, గగన్యాన్ తోసహా అనేక ఇస్రో ప్రాజెక్టులపై కరోనా లాక్డౌన్ ప్రభావం పడింది. వీటిని 2020 చివరిలో చేపట్టాల్సి ఉంది. చంద్రయాన్2 మాదిరి గానే చంద్రయాన్3 ఉన్నప్పటికీ దీనికి ప్రత్యేక ఆర్బిటార్ ఉండకపోవడం గమనార్హం. చంద్రయాన్ 2 లో ప్రయోగించిన ఆర్బిటార్నే ఈ చంద్రయాన్ 3 కి వినియోగిస్తారు. చంద్రుని దక్షిణ ద్రువం పైకి చంద్రయాన్ 2 రోవర్ దిగాలన్న లక్ష్యంతో 2019 జులై 22న ప్రయోగించినప్పటికీ లాండర్ విక్రమ్ సెప్టెంబర్ 7 న ఢీకొనడంతో ఆ ప్రయోగం విఫలమైంది. అయితే ఇప్పుడు గ్రహాంతర యాత్రలకు అవసరమైన శక్తి సామర్థ్యాలు భారత్కు ఉన్నాయని చాటిచెప్పే ప్రతీకగా చంద్రయాన్ 3 ఇస్రోకు కీలకం కానున్నది. ఈ ప్రయోగం తరువాత డిసెంబర్లో మొట్టమొదటి మానవ రహిత యాత్రను గగన్యాన్ ప్రాజెక్టు ద్వారా చేపట్టడానికి ఇస్రో లక్ష్యంగా నిర్దేశించుకుంది. 2022 నాటికి గగన్యాన్ ద్వారా ముగ్గురు భారత వ్యోమగాములను అంతరిక్షం లోకి పంపుతుంది. ఈమేరకు నలుగురు పైలట్లు రష్యాలో శిక్షణ పొందుతున్నారు.