Saturday, April 20, 2024

వాళ్లే నా పంచప్రాణాలు : నితిన్

- Advertisement -
- Advertisement -

Bheeshma

 

నితిన్, రష్మిక హీరోహీరోయిన్లుగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘భీష్మ’. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రం ఈనెల 21న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఫంక్షన్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ మాట్లాడుతూ “నితిన్‌కు వాళ్లన్నయ్య పవన్ కల్యాణ్ ఆశీస్సులెప్పుడూ ఉంటాయి. ఇప్పటికే నేను ఈ సినిమా చూశాను. చాలా బాగుంది. ఈనెల 21న ఈ సినిమాను అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తారని నమ్మకంగా చెబుతున్నా. రష్మిక ‘సరిలేరు నీకెవ్వరు’తో మంచి సక్సెస్ మార్గంలో ఉంది. ఇప్పుడు ‘భీష్మ’తో వస్తోంది. ఆమెకు మరిన్ని విజయాలు రావాలి”అని చెప్పారు. హీరో నితిన్ మాట్లాడుతూ “నా గత సినిమాకు, ఈ సినిమాకు దాదాపు ఒక సంవత్సరం గ్యాప్ ఉంది.

వెంకీ ఫుల్ స్క్రిప్ట్ సిద్ధం చేసేవరకు ఆగి అప్పుడు ఈ సినిమాను మొదలుపెట్టాం. దిల్, సై చిత్రాల తర్వాత మళ్లీ అలాంటి యాంగిల్లో దర్శకుడు వెంకీ కుడుముల నన్ను చూపించాడు. ఈ సినిమాలో నేను చేసిన డ్యాన్స్‌తో అభిమానుల ఆకలి తీరుతుందని అనుకుంటున్నా. స్వరసాగర్ ఈ సినిమాకు లైఫ్‌లాగా నిలిచే సాంగ్స్ ఇచ్చాడు. భవిష్యత్తులో తండ్రికి తగ్గ తనయుడిగా అతను పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నా. కాసర్ల శ్యాం, శ్రీమణి, కృష్ణచైతన్య చాలా మంచి లిరిక్స్ ఇచ్చారు. ఈ సినిమాలో ‘వాటే బ్యూటీ’ సాంగ్‌లో రష్మిక చేసిన డ్యాన్స్ చూసి షాకయ్యా. ఆమె చాలా బాగా చేసింది. ఇక నా జీవితంలో పంచ ప్రాణాలు.. మా అమ్మానాన్నలు, మా అక్క, పవన్ కల్యాణ్, త్రివిక్రమ్. ఇప్పుడు పెళ్లవబోతోంది కాబట్టి నాకు కాబోయే భార్య ఆరో ప్రాణం కాబోతోంది. త్రివిక్రమ్‌తో పరిచయం కావడం, ‘అ ఆ’ సినిమా చేయడం… నా జీవితంలో ఆయన ఉండటం నా అదృష్టంగా భావిస్తాను.

ఆయన నా ముందుంటే నా దారి, నా పక్కనుంటే నా అండ, నా వెనకాల ఉంటే నా ధైర్యం. ఒక్క మాటలో చెప్పాలంటే నాకు మార్గదర్శకుడు. ఇక పవన్ కల్యాణ్ గురించి చెప్పేదేముంది. ఆయన మేలో మన ముందుకు రాబోతున్నారు. అందరం అప్పుడు చొక్కాలు చింపుకొని సినిమా చూద్దాం”అని తెలిపారు. డైరెక్టర్ వెంకీ కుడుముల మాట్లాడుతూ “ఈ సినిమా కథకు సమయం పట్టింది. అందువల్లే నితిన్ అభిమానులు ఎదురుచూడాల్సి వచ్చింది. అయితే సినిమా చాలా బాగా వచ్చింది. ఈ సినిమా విజయంపై నేను చాలా నమ్మకంగా ఉన్నాను”అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రష్మిక, దిల్ రాజు, మహతి స్వరసాగర్, శ్రీమణి, కాసర్ల శ్యామ్, వెంకీ అట్లూరి, బ్రహ్మాజీ తదితరులు పాల్గొన్నారు.

Bheeshma pre release event
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News