సభ్యుల లెక్కింపుపై నిర్వహించాలని గవర్నర్కు బిజెపి వినతి
భోపాల్ : సోమవారం మధ్యప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆదివారం అసెంబ్లీలో శాసనసభ్యుల లెక్కింపుపై బలపరీక్ష నిర్వహించాలని కోరుతూ రాష్ట్ర బిజెపి నేతలు శనివారం గవర్నర్ లాల్జీటాండన్కు మెమొరాండం సమర్పించారు. మూజువాణీ పద్ధతితో బలపరీక్ష జరపరాదని కోరారు. గవర్నర్ను కలిసిన తరువాత సీనియర్ బిజెపి నేత శివరాజ్సింగ్ చౌహాన్ మాట్లాడుతూ 22 మంది ఎంఎల్ఎలు రాజీనామా చేశారని, వీడియోల ద్వారా తమ రాజీనామాలు ధ్రువీకరించారని, ఇప్పుడు కమల్నాధ్ ప్రభుత్వం మైనార్టీలో ఉందని, కొనసాగే రాజ్యాంగ హక్కు లేదని అన్నారు.
గవర్నర్ నియమించిన పరిశీలకుని ద్వారా విశ్వాస పరీక్ష జరగాలని, ఇదంతా వీడియో చిత్రీకరణ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఎంఎల్ఎల బంధువులను, రాష్ట్ర ప్రభుత్వం బెదిరిస్తోందని, ఈ ఎంఎల్ఎలకు వ్యతిరేకంగా కేసులు నమోదయ్యాయని చౌహాన్ ఆరోపించారు. తమ నేత సింధియాజీ శుక్రవారం దాడికి గురయ్యారని, రాజీనామా చేసిన ఎంఎల్ఎలు కేంద్ర బలగాల రక్షణ లేనిదే బెంగళూరు నుంచి తిరిగి రాలేమని డిమాండ్ చేస్తున్నట్టు చౌహాన్ చెప్పారు. గవర్నర్ను కలిసిన ప్రతినిధి వర్గంలో గోపాల్ భార్గవ, మాజీ కేంద్ర మంత్రులు నరోత్తం మిశ్రా, భూపేంద్ర సింగ్, రాంపాల్ సింగ్ ఉన్నారు.