*పార్టీలో అంతర్గ విభేదాలే కారణం
*హిందుత్వానికి దూరం కాను: బండి సంజయ్
మన తెలంగాణ/కరీంనగర్ ప్రతినిధి : కరీంనగర్ బిజెపిలో అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరుతున్నాయి. గత ఎన్నికల్లో కరీంనగర్ బిజెపి అభ్యర్థిగా పోటీ చేసిన బండి సంజయ్ కుమార్ ఏకంగా పార్టీ రాజకీయాలకు ఇక దూరంగా ఉంటానని, తనకవమానం జరిగిందని ప్రకటించడంతో కరీంనగర్ బిజెపి రాజకీయాలు చర్చనీయాంశమయ్యాయి. ఉత్తర తెలంగాణాకే గుండెకాయ వంటి కరీంనగర్లో బిజెపి అంతర్గత విభేదాలకు ఆది నుంచే కేరాఫ్ అడ్రస్గా నిలుస్తోంది. ఈ నేపథ్యంలో గత 2014 ఎన్నికల్లో కరీంనగర్ నుంచి బిజెపి అభ్యర్తిగా పోటీ చేసి యాబైవేల పైచిలుకు ఓట్లతో రెండో స్థానంలో నిల్చిన బండి సంజయ్కుమార్ తను ఎన్నికల్లో నిలబడనంటూ ప్రకటించడంతో ఇప్పుడు కరీంనగర్ బిజెపి రాజకీయాలు మరింత హాట్గా మారాయి, తాను హిందుత్వ, కాషాయ అజెండాకు దూరం కాననీ, కానీ కేవలం రాజకీయాలకు దూరంగా ఉంటానని తనను జిల్లా రాజకీయాలు తీవ్రంగా బాధించాయని ఆయన శనివారం హైదరాబాద్లో మీడియా ముందు తెలిపారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ను తన అనుచరులతో కలిసిన సంజయ్ ఆరోగ్యం బాగాలేకపోయినా, ఆర్థిక ఇబ్బందులున్నా తాను పార్టీ కోసం జైలుకెళ్లాననీ, అయినా తనకు గుర్తింపు ఇవ్వనట్టు మీడియా ముందు వెల్లడించారు. సంజయ్ ప్రకటన తర్వాత కరీంనగర్ బిజెపి రాజకీయాలు హాట్ టాపికై ఇతర పార్టీల్లోను కొంత ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. కరీంనగర్ బిజెపిలో మూడు ముక్కలా అన్న చందంగా, మూడు గ్రూపుల మధ్య వార్ కొనసాగుతోంది.
ప్రస్తుతం బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న మురళీధర్రావు, భారతీయ కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శిగా ఎన్న పొల్సాని సుగుణాకర్ రావులది ఒక వర్గం కాగా, మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి, ప్రస్తుత బిజెపి జిల్లా అధ్యక్షుడు కొత్త శ్రీనివాస్ రెడ్డిలది మరో వర్గంగా ఉండగా ఇక రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించిన బండి సంజయ్ కుమార్ ది మరో సెపరేట్ దారి, ఈ నేపధ్యంలో ఆది నుంచే ఈ వర్గ విభేదాలు కొనసాగుతుండగా ఇప్పుడు బండి సంజయ్ ప్రకటనతో మరింత తారా స్థాయికి చేరాయి. గత నెల 27న మానకొండూర్ లో బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్రావు హాజరైన రైతు పంచాయితీలోనూ, బిజెపి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు కొత్త శ్రీనివాస్ రెడ్డికీ, మరో రైతు సంఘ నేతకు మధ్య ప్రసంగం విషయంలో మాటల యుద్దానికి తెరతీసింది. అక్రమంలో ఆ గొడవకు కారణం గుజ్జుల రామకృష్ణారెడ్డి వర్గమేనని, బూత్ స్థాయి డేటా మొత్తం అధికార పార్టీకి ఇచ్చేస్తున్నారన్నా ఆరోపణలు మురళీధర్రావు వర్గం నుంచి మిన్నంటాయి. ఈ నేపధ్యంలో మూడు వర్గాలు, మూడు రకాలుగా ఒకరిపై ఒకరు బురద జల్లుకుంటూ ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్న క్రమంలోనే సంజయ్ ప్రకటన, చివరకు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ బుజ్జగించినా, ఆయన వినకపోవడం ఇప్పుడు జిల్లాకు సంబంధించిన బిజెపి అంతర్గత విభేదాలను పట్టిచూపిస్తోంది. అసలే ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ, ముందస్తు ఎన్నికలు కూడా వచ్చే అవకాశముందన్న ప్రచారం నేపథ్యంలో ఒకరిపై ఒకరు అధిష్టానానికి ఫిర్యాదు చేసుకోవడం, విరుద్దమైన, సంచలమైన ప్రకటనలు చేస్తుండటంతో వచ్చే ఎన్నికల్లో కరీంనగర్లో బిజెపి పరిస్థితి ఏమిటన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారిన పరిస్థితి.