Saturday, April 20, 2024

ఖమ్మంలో బ్లాక్ ఫంగస్ కేసు నమోదు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కరోనా నుంచి ఎన్నో వ్యయప్రయాసలకోర్చి కోలుకున్న వారిని ఇప్పుడు కొత్తగా బ్లాక్ ఫంగస్ భయాందోళనలకు గురిచేస్తోంది. ఇప్పటికే దేశంలోని పలు రాష్ట్రాల్లో కలకలం సృష్టిస్తున్న బ్లాక్ ఫంగస్ తాజాగా తెలంగాణలోనూ హడలెత్తిస్తోంది. ఇప్పటికే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పలువురికి బ్లాక్ ఫంగస్ సోకగా.. శనివారం ఖమ్మం జిల్లాలో బ్లాక్ ఫంగస్ కేసు వెలుగుచూసినట్లుగా తెలుస్తోంది. మధిర నియోజకవర్గంలోని నేరడ గ్రామానికి చెందిన తాళ్లూరి భద్రయ్యకు బ్లాక్ ఫంగస్ లక్షణాలు కనిపించాయని ఖమ్మం ప్రభుత్వ హాస్పిటల్ డాక్టర్లు తెలిపారు. ఆయనను వెంటనే హైదరాబాద్ గాంధీ హాస్పిటల్‌కి వెళ్లాల్సిందిగా సూచించినట్లు వెల్లడించారు. తాళ్లూరి భద్రయ్య ఇటీవలే కరోనా నుంచి కోలుకున్నారని, ఇప్పుడు బ్లాక్ ఫంగస్ లక్షణాలను గుర్తించామన్నారు. కాగా బ్లాక్ ఫంగస్‌తో తెలంగాణలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. గాంధీ ఆసుపత్రిలో మరో ముగ్గురు కరోనా రోగుల్లోనూ దీనిని గుర్తించారు.

మరికొందరు ఈ లక్షణాలతో చికిత్స కోసం ఆసుపత్రుల్లో చేరుతున్నట్లు గుర్తించారు. నగరంలోని ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో బ్లాక్ ఫంగస్‌తో చికిత్స పొందుతున్న నిర్మల్ జిల్లా భైంసా డివిజన్‌కు చెందిన ఓ వ్యక్తి మృతి చెందినట్లు సమాచారం. సంబందిత వైద్య వర్గాలు మాత్రం దీనిని నిర్ధారించడం లేదు. ఇటీవల ప్రైవేటు ఆసుపత్రిలో సుదీర్ఘకాలం చికిత్స తీసుకున్న ముగ్గురు గాంధీలో చేరారు. వారిలో ఈ ఫంగస్ లక్షణాలు గుర్తించారు. వారిలో ఇద్దరి పరిస్థితి నిలకడగా ఉండగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. సాధారణంగా కరోనా రోగుల్లో వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది. దీనికి తోడు ఆక్సిజన్ స్థాయి తగ్గిన వారికి స్టైరాయిడ్స్ అందిస్తుంటారు. అవి వ్యాధి నిరోధక శక్తిపై కొంత ప్రభావం చూపిస్తాయి. దానికి మధుమేహం తోడైతే.. బ్లాక్ ఫంగస్ వచ్చే అవకాశం ఉండొచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

Black Fungus Case reported in Khammam Govt Hospital

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News