నోయిడా(యుపి): మద్యం తాగిన మత్తులో మూత్రవిసర్జన కోసం రోడ్డు పక్కన కారు ఆపితే ఆ కారు తీసుకుని ఉడాయించారు చోరులు. ఈ సంఘటన ఉత్తర్ ప్రదేశ్లోని నోయిడాలో చోటు చేసుకుంది. స్టాక్ బ్రోకర్గా వ్యవహరించే రిషబ్ అరోరా శనివారం రాత్రి ఒక పార్టీలో ఫుల్లుగా మందు తాగాడు. బిఎండబ్ల్యు కారులో ఇంటికి తిరిగి వస్తున్న అతను నోయిడాలో రోడ్డు పక్కన కారు నిలిపి మూత్ర విసర్జన కోసం వెళ్లాడు. ఇంతలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఆ కారుతో పరారయ్యారు. ఖరీదైన ఈ కారు అరోరా బావమరిదిది కావడం విశేషం. ఈ కారుకు సంబంధించి అతను బ్యాంకుకు ఇంకా రూ.40 లక్షల రుణ బకాయిలు చెలించాల్సి ఉంది. బిఎండబ్ల్యు కారు చోరీకి గురైందన్న విషయం తెలుసుకున్న పోలీసు సీనియర్ అధికారులు హుటాహుటిన అక్కడకు చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. అయితే మోటారు సైకిల్పై వచ్చిన దుండగులు తాను మూత్ర విసర్జన చేస్తుండగా తన తలకు తుపాకీ పెట్టి బెదిరించారని అరోరా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే పూర్తిగా మద్యం మత్తులో ఉన్న అరోరా వాదనపై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. డ్రంక్ అండ్ డ్రైవింగ్ కింద అరోరాపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారా అన్న మీడియా ప్రశ్నకు ప్రస్తుతం చోరీకి గురైన కారును స్వాధీనం చేసుకుని దొంగలను పట్టుకోవడమే తమ ప్రథమ కర్తవ్యమని నోయిడా డిసిపి హరీష్ చందర్ తెలిపారు.