హైదరాబాద్: బోట్లు, లైఫ్ జాకెట్లతో వరదల సమయంలో తమ సామర్థం మరింత పెరుగుతుందని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ అన్నారు. టాటా అడ్వాన్స్డ్ సిస్టంస్ రాచకొండ పోలీసులకు రెండు బోట్లు, లైఫ్ జాకెట్లు విరాళంగా ఇచ్చారు. నేరెడ్మెట్లోని రాచకొండ పోలీస్ కమిషనరేట్లో బుధవారం వాటిని టాటా ఎరోఇంజీన్స్ హెడ్ మసూద్ హుస్సేనీ వాటిని సిపి మహేష్ భగవత్కు అందజేశారు. ఈ సందర్భంగా సిపి మహేష్ భగవత్ మాట్లాడుతూ అత్యవసర సమయంలో వేరే వారిపై ఆధారపడకుండా బోట్లు ఉపయోగపడతాయని అన్నారు. నగరానికి వరదలు వచ్చినప్పుడు బోట్లు, లైఫ్ జాకెట్ల కొరతను ఎదుర్కొన్నామని అన్నారు. వరదలు వచ్చినప్పుడు లైఫ్ జాకెట్లు పోలీసులకు ఉపయోగపడుతాయని అన్నారు. తము బోట్లు, లైఫ్ జాకెట్లు అందజేసిన టాటా సంస్థకు కృతజ్ఞతలు తెలిపారు.
ఒక బోటులో ఎనిమిది నుంచి 10మంది వెళ్లవచ్చని తెలిపారు. ఎంపిక చేసిన పోలీసులకు ఎన్డిఆర్ఎఫ్, ఎస్డిఆర్ఎఫ్తో శిక్షణ ఇప్పించనున్నట్లు తెలిపారు. టాటా ఎరోస్ట్రక్చర్స్ అండ్ ఎరోఇంజిన్స్ హెడ్ మసూద్ హుస్సేనీ మాట్లాడుతూ ఇటీవల వచ్చిన వరదల సమయంలో రాచకొండ పోలీసులు కీలక పాత్ర పోషించారని అన్నారు. వరదల సమయంలో చాలామంది ప్రాణాలను కాపాడారని అన్నారు. పోలీసులు పటిష్టమైన భద్రత ఏర్పాటు చేయడం వల్లే నగరానికి అంతర్జాతీయ సంస్థలు వస్తున్నాయని తెలిపారు. కార్యక్రమంలో టాటా సిఈఓ విశాల్ సింఘ్వీ, ఆర్కె సింగ్, శ్రీధర్, గుణశేఖర్, కెప్టెన్ కవిత జయరాం, శ్రీనివాస్, వెంకటేష్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.