ముంబయి: కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం బాలీవుడ్పై తీవ్రంగా ఉంది. దేశంలోని ప్రధాన నగరాలన్నిటిలో సినిమా థియేటర్లను ఈ నెల వరకు మూసివేయడంతో ఇటీవలే విడుదలైన బాగీ 3, అంగ్రేజీ మీడియం చిత్రాలు తీవ్ర నష్టాలను చవిచూశాయి. కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునే చర్యలలో భాగంగా షూటింగ్లు, ఇతర ఈవెంట్లన్నీ వాయిదాపడడంతో బాలీవుడ్లో పనిచేసే దినసరి కార్మికుల బతుకులు రోడ్డునపడ్డాయి. దినసరి వేతనంపై పనిచేసే స్పాట్ బాయ్స్, కార్పెంటర్లు, లైట్మెన్, స్టంట్మెన్, పెయింటర్లు తదితర బాలీవుడ్ కార్మికుల రోజువారీ జీవితం అగమ్యగోచరంగా తయారైంది. మళ్లీ బాలీవుడ్లో షూటింగ్ కార్యకలాపాలు మొదలయ్యేవరకు ఈ కార్మికులు ఏం తిని బతుకుతారని బాలీవుడ్కు చెందిన ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతానికి మార్చి 31 వరకు షూటింగ్లు, సినిమా థియేటర్ల మూసివేత కొనసాగుతుందని చెబుతున్నప్పటికీ ఎప్పుడు తిరిగి ప్రారంభమవుతుందో ఎవ్వరూ చెప్పలేరని ఒక ఇంగ్లీష్ మ్యాగజైన్కు ఇచ్చిన ఇంటర్వూలో ఆయన వ్యాఖ్యానించారు.
ఇప్పుడు అందరూ క్షేమంగా, ఆరోగ్యంగా ఉండాలన్నదే అందరి ధ్యేయమైనప్పటికీ దినసరి కార్మికులకు అండగా బాలీవుడ్ నిలబడాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. దినసరి కార్మికులకు ఆర్థికంగా సహాయపడేందుకు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ముందుకు వచ్చిందని, అదే విధంగా దర్శకులు, నిర్మాతలు కూడా ఇందుకు విరాళం అందచేయాలని ఆయన కోరారు. కాగా, బాలీవుడ్ దినసరి కార్మికుల మార్చి 22 నుంచి వారం రోజుల పాటు రేషన్, నిత్యావసర వస్తువులు ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు ఫెడరేషన్ ఆఫ్ వెస్టర్న్ ఇండియా సినీ ఎంప్లాయిస్ ప్రకటించింది.
ఇలా ఉండగా, షారూక్ ఖాన్, ఆమిర్ ఖాన్, సల్మాన్ ఖాన్, దీపికా పదుకొణె, వరుణ్ ధావన్, విక్కీ కౌశల్ తదితర అగ్రనటీనటులు కూడా ముందుకు వచ్చి దినసరి కార్మికులను ఆదుకోవాలని మరో ప్రముఖ సినీ విమర్శకుడు కోమల్ నహతా పిలుపునిచ్చారు. వీరంతా తలా కోటి రూపాయల చొప్పున విరాళాలు ఇవ్వడం పెద్ద సమస్య ఏమీ కాదని ఆయన చెప్పారు. మరో సినీ నిపుణుడు అటుల్ మోహన్ కూడా పెద్ద తారలంతా ముందుకు వచ్చి దినసరి కార్మికులకు రేషన్ అందచేయడానికి విరాళాలు ఇవ్వాలని కోరారు. కరోనా వైరస్ కారణంగా బాలీవుడ్ రూ. 700-800 కోట్ల నష్టాన్ని చవిచూసే అవకాశం ఉందని కోమల్ నహతా అంచనా వేశారు.