ఆంధ్రప్రదేశ్/చిత్తూరు : రేణిగుంట రైల్వే స్టేషన్ పరిదిలోని పట్టాలపై బాంబు పేలుడు కలకలం సృష్టించింది. రేణిగుంట రైల్వే స్టేషన్ పరిదిలోని రైల్వే ట్రాక్ పరిసరాల్లో పశువులు మేపడానికి వచ్చిన శశికళ అనే మహిళ పట్టాల వద్ద ఓ డబ్బాను గుర్తించింది. తన చేతిలో ఉన్న కర్రతో డబ్బాను కదిలించడంతో భారీ శబ్ధంతో పేలుడు సంభవించింది. ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలుడు సంభవించడంతో శశికళ అనే మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. చేతివేళ్లు సహా కుడిచేయి భాగం అంతా ఛిద్రమై తీవ్ర రక్తస్రావమైంది. విషయం తెలుసుకున్న జిఆర్ పి, పోలీసులు హుటాహుటీన ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించింది. బాధితురాలిని చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రంలోని రుయా ఆస్పత్రికి తరలించారు. అడవి పందుల కోసం పెట్టిన నాటుబాంబు పేలినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. పేలుడు పదార్థాన్ని పరీక్ష నిమిత్తం పంపామని నివేదిక వచ్చాక పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.