Friday, March 29, 2024

భారత్ స్వర్ణాల సాగు

- Advertisement -
- Advertisement -

బర్మింగ్‌హామ్ : కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ పతకాల పంట పండిస్తోంది. పురుషుల ట్రిపుల్ జంప్, మహిళల హాకీ, పారా టిటిలలో పతకాలు సాధించిన భారత్ పతకాల పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకింది. బాక్సింగ్‌లో భారత్ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. మహిళల బాక్సింగ్ 50 కేజీల విభాగంలో తెలంగాణ ముద్దు బిడ్డ బాక్సర్ నిఖత్ జరీన్ స్వర్ణ పతకాన్ని అందుకుంది. ఆదివారం జరిగిన పసిడి పోరులో జరీన్ సంపూర్ణ ఆధిపత్యాన్ని ప్రదర్శంచింది. మెక్‌నౌల్(నార్త్ ఐర్లాండ్)తో ఫైనల్లో జరీన్ విజయం సాధించి బంగారు పతకాన్ని అందుకుంది.

ఇక మరో బాక్సర్ నీతూ గంగాస్ బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. మహిళల 48 కేజీల విభాగంలో ఇంగ్లండ్‌కు చెందిన బాక్సర్‌ను ఓడించింది. భారత బాక్సర్ పంచ్‌లకు ఇంగ్లండ్ బాక్సర్ రింగ్‌లో నిలవలేకుండా పోయింది. ఇక, పరుషుల విభాగంలో భారత స్టార్ బాక్సర్ అమిత్ పంగాల్ సత్తా చాటాడు. ఇంగ్లండ్‌కు చెందిన బాక్సర్ మెక్‌డొనాల్డ్‌పై పంచ్‌లతో చెలరేగి స్వర్ణం దక్కించుకున్నాడు. 2018 కామన్వెల్త్ గేమ్స్‌లో రజతంతో సరిపెట్టుకున్న పంగాల్.. ఈ సారి 51 కిలోల ఈవెంట్‌లో స్వర్ణం సాధించాడు.

మ్యాచ్‌లో పంగాల్ ఆధిపత్యం..

మూడు రౌండ్‌లో, పంగాల్ ఇంగ్లీష్ బాక్సర్‌కు కోలుకునే అవకాశం ఇ్వకుండా పంచ్‌లతో అతనిపై ఒత్తిడిని పెంచుతూ చెలరేగాడు. ఇంగ్లీష్ బాక్సర్ మెక్‌డొనాల్డ్‌పై పూర్తి ఆధిపత్యం చెలాయించాడు. మొదటి రౌండ్‌లో పంగాల్‌కు 10 పాయింట్లు రాగా, రెండో రౌండ్‌లోనూ 10 పాయింట్లు సాధించాడు. మూడో రౌండ్‌లోనూ 10 పాయింట్లు కైవసం చేసుకున్నాడు. దీంతో పంగాల్ 5-0 తేడాతో విజయం సాధించాడు.

ట్రిపుల్ జంప్‌లో పసిడి..

భారతకు ట్రిపుల్‌జంప్‌లో తొలిసారిగా స్వర్ణ పతకం దక్కింది. భారత్‌కు చెందిన అల్డోస్ పాల్ దేశానికి బంగారు పతకాన్ని అందించాడు. అదే సమయంలో ఇదే ఈవెంట్‌లో మరో భారత అథ్లెట్ అబ్దుల్లా రజత పతకాన్ని కైవసం చేసుకున్నాడు. మరో భారత అథ్లెట్ ప్రవీణ్ కాంస్య పతకాన్ని కొద్దిలో కోల్పోయాడు. అతను నాలుగో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. పాల్ 17.03 మీటర్ల జంప్‌తో మొదటి స్థానంలో నిలిచాడు. అదే సమయంలో మరో అథ్లెట్ అబ్దుల్లా అబుబకర్ కేవలం .01 తేడాతో రెండో స్థానంలో నిలిచాడు. అబ్దుల్లా 17.02 మీటర్లు దూకాడు. పాల్ తన తొలి ప్రయత్నంలో 14.62 మీటర్లు దూకాడు. ఆ తర్వాత, అతను తదుపరి ప్రయత్నంలో 16.30 మీటర్లకు చేరుకున్నాడు. అనంతరం పాల్ 17.03 మీటర్లు దూకి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అబ్దుల్లా అబూబకర్ గురించి మాట్లాడితే, అతను నాల్గవ ప్రయత్నం వరకు 16.70 మీటర్లు మాత్రమే దూకాడు. కానీ, ఐదవ ప్రయత్నంలో ఈ ఆటగాడు 17.02 మీటర్లు దూకి రెండవ నంబర్‌కు చేరుకున్నాడు. ఈ విధంగా అబ్దుల్లా రజత పతకాన్ని అందుకున్నాడు.

భవినాకు బంగారం..

భారత పారా టేబుల్ టెన్నిస్ ప్లేయర్ భవినా పటేల్ పసిడి పతకాన్ని సాధించింది. శనివారం అర్థ రాత్రి జరిగిన పారా టేబుల్ టెన్నిస్ సింగిల్స్ 3-5 కేటగిరీలో స్వర్ణం గెలుచుకుంది. గుజరాత్‌కు చెందిన 35 ఏళ్ల భవినా తుదిపోరులో నైజీరియాకు చెందిన క్రిస్టియానాపై 3-0తో విజయం సాధించింది. దీంతో టిటి విభాగంలో భారత తరఫున గోల్డ్ మెడల్ సాధించిన మొదటి ప్లేయర్‌గా రికార్డు నెలకొల్పింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News