రాయచూర్: కర్నాటకలోని రాయచూర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ప్రేమించిన యువతి దక్కలేదని ఓ యువకుడు ఉన్మాదిగా మారాడు. ప్రియురాలి కుటుంబంపై రాళ్లదాడికి దిగాడు. రాళ్లదాడిలో ఐదుగురు మృతి చెందారు. రాయచూర్ జిల్లా సింధనూర్ లో ఈ సంఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే… సింధనూర్ చెందిన మంజుల, మౌనేష్ తో ప్రేమలో పడింది. కొన్నాళ్లుగా అతని ప్రవర్తన నచ్చక దూరంగా ఉంటుంది. అయితే మంజులకు ఇటీవల మరో వ్యక్తితో వివాహం జరిగింది. సింధనూర్ లోని సూకల పేటలో భర్త అత్తమామలతో కలసి ఉంటోంది మంజుల.
ప్రియురాలు వేరే వ్యక్తితో వివాహం చేసుకోవడం జీర్ణించుకోలేని మౌనేష్ తన స్నేహితులతో కలిసి మొత్తం కుటుంబంపై రాళ్లతో దాడి చేశాడు. ఈ దాడిలో మంజులతో పాటు ఆమె భర్త, అత్తమామలు అక్కడికక్కడే మృతి చెందారు. 60ఏళ్ల వీరప్ప అనే వృద్దుడు తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. దాడి జరిగిన వెంటనే మౌనేష్ అతని గ్యాంగ్ అక్కడి నుంచి పరారైంది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుల కోసం స్పెషల్ టీమ్స్ గాలింపు చర్యలు చేపట్టాయని పోలీసులు తెలిపారు.