ఆనందం వ్యక్తం చేసిన రైతులు
మన తెలంగాణ/మోత్కూరు: మోత్కూరు మున్సిపల్ కేంద్రంలోని పెద్ద చెరువు నుంచి బృందావన్ కాలువ ద్వారా మండలంలోని పాటిమట్ల గ్రామ చెరువులోకి నీళ్లు రావడం పట్ల బుధవారం రైతులు, టిఆర్ఎస్ నాయకులు ఆనందం వ్యక్తం చేశారు. గత కొన్నేళ్లుగా ఎలాంటి మరమ్మతులు లేకుండా పడావుపడిన కాల్వను జడ్పిటిసి గోరుపల్లి శారదసంతోష్రెడ్డి, ఎంపిటిసి రచ్చ కల్పన లక్ష్మీనర్సింహారెడ్డిలు తమ స్వంత డబ్బులతో ఇటీవల కాల్వ పూడికతీత పనులు చేయించారు. బిక్కేరు వాగు నుంచి బృందావన్ కాలువ ద్వారా మోత్కూరు పెద్ద చెరువులోకి నీళ్లు వచ్చి నిండి అలుగు పోస్తున్నది. దీంతో ఆ నీళ్లు అలుగు ద్వారా కొండగడప నుంచి పాటిమట్ల చెరువులోకి సాఫీగా వచ్చి చేరుతుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తూ బుధవారం పాటిమట్ల వద్ద కాల్వలో నీటికి రైతులు, జడ్ పిటిసి, ఎంపిటిసి పూజలు నిర్వహించారు. కాలువ పూడికతీత పనులు చేయించిన జడ్ పిటిసి, ఎంపిటిసిలకు రైతులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ దండెబోయిన మల్లేష్, నాయకులు సంతోష్రెడ్డి, లక్ష్మీనర్సింహారెడ్డి, దొండ దశరథ, బండి రాజు, సత్తయ్య, నరేందర్రెడ్డి, వెంకట్రెడ్డి, రాజిరెడ్డి, రాజేష్, సోమయ్య, యాదయ్య, శ్రీను, సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.