మునుగోడు : మతిస్థిమితం లేని భర్త చేతిలో భార్య దారుణ హత్యకు గురైన సంఘటన శనివారం అర్థరాత్రి నల్లగొండ జిల్లా మునుగోడు మండలంలోని చీకటిమామిడి గ్రామంలో చోటు చేసుకుంది. ఈ ఘటనలో పోలగోని జయమ్మ(45) ప్రాణాలు కోల్పోయింది. పోలీసులు గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన పోలగోని ముత్యాలు గత కొన్నేళ్లుగా మతిస్తిమితం కోల్పోయి కుటుంబ సభ్యుల సంరక్షణలో ఉంటున్నాడు. వారం రోజుల క్రితమే తమ కుమారుడి వివాహం జరిపించారు. శనివారం రాత్రి భార్య భర్తలు మాత్రమే ఇంట్లో ఉన్నారని, అర్థరాత్రి దాటిన తర్వాత కొడవలితో భార్య గొంతుకోసి హత్య చేశాడని తెలిపారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకోని నిందితుడిని ఆదుపులోకి తీసుకున్నారు. జయమ్మ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు ఎస్ఐ రజనీకర్ తెలిపారు.