కర్నాటక సిఎం యడియూరప్ప వెల్లడి
బెంగళూరు: వరద నష్టాన్ని అంచనా వేయడానికి కేంద్ర బృందాలు కర్నాటకలోని వరద తాకిడికి గురైన ప్రాంతాలను సందర్శిస్తున్నాయని, కేంద్ర నుంచి మరింత సాయాన్ని కోరేందుకు తాను కూడా ఢిల్లీకి వెళుతున్నానని కర్నాటక ముఖ్యమంత్రి బిఎస్ యడియూరప్ప మంగళవారం తెలిపారు. కాగా.. యడియూరప్ప ఢిల్లీ పర్యటన నిర్ణయంతో ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు బిజెపి పెద్దల నుంచి అనుమతి లభించవచ్చన్న ఊహాగానాలు మళ్లీ జోరందుకున్నాయి.
మంగళవారం నాడిక్కడ యడియూరప్ప విలేకరులతో మాట్లాడుతూ మూడు బృందాలుగా కేంద్ర పరిశీలకులు రాష్ట్రంలోని వరద ప్రాంతాలలో పర్యటిస్తున్నారని, వారి వెంట రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఉన్నారని చెప్పారు. పర్యటన అనంతరం కేంద్ర బృందాలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో సమావేశమవుతారని ఆయన తెలిపారు. వరుసగా మూడు సంవత్సరాలు వరదలు సృష్టించిన విధ్వంసాన్ని కేంద్ర బృందాలకు సోమవారం సాయంత్రం వివరించానని ఆయన తెలిపారు. వారి ద్వారా కేంద్రానికి ఒక వినతిపత్రాన్ని కూడా ఇచ్చినట్లు ఆయన చెప్పారు.
BS Yediyurappa to travel to New Delhi