Wednesday, April 24, 2024

నేడే బడ్జెట్

- Advertisement -
- Advertisement -

Budget proposals are approved by TS cabinet

రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం

2.50 కోట్లు?

నిరుద్యోగ భృతికి కేటాయింపులు?

2023 ఎన్నికలకు ముందు పూర్తిస్థాయి చివరి బడ్జెట్ భేటీలో
ఆదివారం నాడు ఆమోదం తెలిపిన మంత్రివర్గం అభివృద్ధి,
సంక్షేమాలకు సమ ప్రాధాన్యం కొత్త పథకాలకు అవకాశం

మన తెలంగాణ/హైదరాబాద్ : 2022-2023 ఆర్ధిక సంవత్సరాని కి రూపొందించిన బడ్జెట్ ప్రతిపాదనలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన ప్రగతి భవన్‌లో జరిగిన ఈ సమావేశంలో బడ్జెట్‌పై ప్రధానంగా మంత్రివర్గం చర్చించింది. సోమవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అ వుతున్న నేపథ్యంలో మొదటి రోజునే శాసనసభలో ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు, శాసనమండలిలో మంత్రి ప్రశాంత్‌రెడ్డి బడ్జెట్‌ను ప్రవేశ పె ట్టనున్నారు.

కీలక రంగా లకు బడ్జెట్‌లో ప్రభుత్వం ఇచ్చిన ప్రాధాన్యత… ఆయా శాఖలకు కేటాయించిన నిధులపై మంత్రివర్గం సమీక్షించింది. అలాగే ఈ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై మంత్రులకు సిఎం కెసిఆర్ దిశానిర్దేశం చేశారు. నూతన ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ లక్ష్యాలు, విధానాలు, బడ్జెట్ కేటాయింపులు, తదితర అంశాలను మంత్రివర్గ సహచరులకు ఆయన వివరించారు. 2023 ఎన్నికలకు ముందు పూర్తి స్థాయి చివరి బడ్జెట్ అయినందున అనుసరించాల్సిన కార్యాచరణ, అమలు తీరుతెన్నులపై వివరించినట్లు తెలుస్తోంది. తాజా భేటీలో బడ్జెట్‌తో పాటు రాజకీయ అంశాలు కూడా చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా జాతీయ స్థాయిలో కాంగ్రెస్, బిజెపిలకు ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేయబోయే కూటమిపై చర్చించినట్లు తెలుస్తోంది. ఇటీవలి రాంచీ, ఢిల్లీ, ముంబై పర్యటనల వివరాలను మంత్రులతో సిఎం కెసిఆర్ పంచుకున్నట్లు చెబుతున్నారు.

అనంతరం బడ్జెట్‌కు మంత్రివర్గం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. గత బడ్జెట్ కంటే ఎక్కువగా కేటాయింపులు ఉండనున్నాయని ప్రభుత్వ వర్గాల్లో వినిపిస్తోంది. కరోనా నుంచి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతున్న క్రమంలో బడ్జెట్ అంచనాలు భారీగా ఉండనున్నట్లు సమాచారం.

అయితే ఈ సారి బడ్జెట్ రూ. 2.50 లక్షల కోట్ల నుంచి రూ. 2.70 లక్షల కోట్లకుపైగా ఉండే అవకాశముందని తెలుస్తోంది. గత ఆర్ధిక సంవత్సరం (2021..2022)లో ప్రభుత్వం 2,30,825.96 కోట్లతో ప్రవేశపెట్టింది. దీనికి మరో ముప్పై నుంచి నలభై వేల కోట్ల బడ్జెట్‌కు అదనంగా నిధుల కేటాయింపులు చేసినట్లుగా తెలుస్తోంది. అయితే అతి ముఖ్యమైన రంగాలకు మాత్రం ఎప్పటిలాగానే రాష్ట్ర ప్రభుత్వం నిధుల కేటాయింపులో ఎక్కవ ప్రాధాన్యత ఇచ్చినట్లుగా సమాచారం.

అభివృద్ధి, సంక్షేమ రంగాలకు బడ్జెట్‌లో రాష్ట్ర ప్రభుత్వం సమ ప్రాధాన్యత ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ సారి సబ్బండ వర్గాలకు మరింత పెద్దపీట వేసినట్లుగా తెలుస్తోంది. దీని కోసం ప్రత్యేకంగా పథకాలను కూడా పొందుపరిచినట్లుగా సమాచారం. ఒకవైపు అభివృద్ధి, సంక్షేమ పథకాలకు అధిక ప్రాధాన్యతను ఇస్తూనే మరోవైపు వాటికి అవసరమైన నిధుల సేకరణకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చర్యలను బడ్జెట్‌లో సమగ్రంగా పొందుపరచారని తెలుస్తోంది. శాఖలవారీగా పద్దుల కేటాయింపులు, ఉద్యోగ నియామకాలు, పేదలకు డబల్ బెడ్ రూమ్ ఇళ్లకు ప్రత్యామ్నాయంగా కొత్త పథకాన్ని ప్రవేశపెట్టబోతున్నట్లు సమాచారం.

అలాగే వ్యవసాయం, సంక్షేమం, పెరిగిన జీత భత్యాలతో పాటు దళిత బంధు లాంటి పథకాలకు భారీగా నిధులు కేటాయించినట్లుగా తెలుస్తుంది. దళిత బంధు పథకానికి బడ్జెట్‌లో మరింత ప్రాధాన్యత దక్కినట్లుగా ప్రభుత్వ వర్గాల్లో వినపడుతోంది. ఏటా బడ్జెట్‌లో రూ. 20వేల కోట్లను కేటాయిస్తామని ఇప్పటికే ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనికి అదనంగా మరిన్ని కేటాయింపులు జరిగినా ఆశ్చర్యపడాల్సిన అవరసం లేదన్న ప్రచారం కూడా సాగుతోంది. అలాగే వ్యవసాయం రంగానికి రాష్ట్ర ప్రభుత్వం ఇరవై నాలుగు గంటల పాటు ఉచిత విద్యుత్‌ను సరఫరా చేస్తోంది. దీని కోసం రాష్ట్ర ప్రభుత్వం గత సంవత్సరంలో రూ.10,500 కోట్లను వెచ్చించగా… ప్రస్తుతం రాష్ట్రంలో సాగు విస్తీర్ణం మరింత పెరిగిన నేపథ్యంలో కరెంటు సరఫరా కోసం నిధుల కేటాయింపు మరింత పెరిగే అవకాశముంది. అలాగే రైతు బంధు పథకానికి రూ.14,800 కోట్లను కేటాయించగా….కొత్త బడ్జెట్‌లో రూ. 15వేల కోట్లకు పైగా నిధులు కేటాయించినట్లుగా సమాచారం.

రైతు భీమా కోసం రూ.2,368 కోట్ల నుంచి రూ.2400 కోట్లకు పెరగనుందని తెలుస్తోంది. మొత్తంగా వ్యవసాయ రంగానికి రూ.25వేల కోట్ల నుంచి సుమారు రూ.30 కోట్ల మేరకు కేటాయింపులు పెరగనున్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. అదే సమయంలో సాగునీటి రంగానికి గత బడ్జెట్‌లో రూ.16.931 కోట్లు కేటాయించగా… వచ్చే ఆర్ధిక సంవత్సరం బడ్జెట్‌లో దాదాపుగా రూ.18వేల కోట్ల మేర నిధులు కేటాయింపులు జరిగినట్లుగా తెలుస్తోంది. ఆసరా పెన్షన్లకు నిధులుగా భారీగా పెరిగాయని తెలుస్తోంది. ప్రస్తుతం రూ.11,728 కోట్ల కేటాయించిన ప్రభుత్వం వచ్చే ఆర్ధిక సంవత్సరానికి మొత్తంగా రూ.12వేల కోట్ల మేర ప్రతిపాదనలు చేసినట్లుగా సమాచారం. ఇక కళ్యాణ లక్ష్మీ పథకానికి రూ.6,500 కోట్ల మేరకు నిధులను బడ్జెట్‌లో ప్రతిపాదించారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. అలాగే నిరుద్యోగ భృతి పథకానికి కూడా ఈసారి కేటాయింపులు ఉంటాయని అంటున్నారు. మొత్తానికి వచ్చే ఏడాదే అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం జనరంజక బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశం ఉందంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News