టిక్టాక్ వ్యాపారం కొనండి
రిలయన్స్తో బైట్డాన్స్ చర్చలు
జూలై చివరలో రెండు సంస్థల మధ్య చర్చలు ప్రారంభం
న్యూఢిల్లీ : వీడియో షేరింగ్ యాప్ టిక్ టాక్ మాతృ సంస్థ బైట్డాన్స్ ముకేష్ అంబానీ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్తో చర్చలు జరిపిందని సమాచారం. భారతదేశంలో టిక్ టాక్ వ్యాపారాన్ని విక్రయించేందుకు గాను బైట్డాన్స్ ఈ చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. మీడియా నివేదికల ప్రకారం, బైట్డాన్స్ టిక్ టాక్ అనే వీడియో యాప్ను ముకేశ్ అంబానీ యాజమాన్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్)కు అమ్మవచ్చు. ఈ విషయంపై జూలై చివరలో రెండు సంస్థల మధ్య చర్చలు ప్రారంభమయ్యాయి. అయితే ఈ సంస్థలు ఇంకా ఎటువంటి ఒప్పందానికి రాలేదు. అదే సమయంలో రిలయన్స్, బైట్డాన్స్, టిక్టాక్ సంస్థలు కూడా దీనిపై స్పందించలేదు. లడఖ్లోని గాల్వన్ లోయలో సరిహద్దు వివాదం తరువాత చైనాకు చెందిన 59 యాప్లను భారత ప్రభుత్వం నిషేధించింది.
టిక్టాక్, వీచాట్, అలీబాబా గ్రూప్నకు చెందిన యుసి బ్రౌజర్, యుసి న్యూస్ వంటి ప్రముఖ యాప్లు ఈ నిషేధించిన జాబితాలో ఉన్నాయి. దీని తర్వాత గత జూలైలోనూ 47 చైనా యాప్లను ప్రభుత్వం నిషేధించింది. ఇవి గతంలో నిషేధించిన యాప్ల క్లోన్లు, ఈ విధంగా భారతదేశంలో ఇప్పటివరకు చైనాకు చెందిన 106 యాప్లను భారత ప్రభుత్వం నిషేధించింది. టిక్టాక్ భారతీయ వ్యాపారం విలువ 3 బిలియన్ డాలర్లుగా ఉంది. చైనా యాప్ టిక్టాప్ నిషేధానికి గత వారం అమెరికా ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక తీర్మానంపై సంతకం చేశారు. అయితే టిక్టాక్ అమెరికా వ్యాపారాన్ని అమెరికన్ కంపెనీకి విక్రయించడానికి సెప్టెంబర్ 15 వరకు బైట్ డాన్స్కు గడువు ఇచ్చింది. సెప్టెంబరు 15లోగా బైట్డాన్స్ ఒప్పందం చేయలేకపోతే టిక్ టాక్పై నిషేధం వర్తిస్తుంది. టిక్టాక్ యుఎస్ వ్యాపారాన్ని కొనుగోలు చేసేందుకు మైక్రోసాఫ్ట్ చర్చలు జరుపుతోంది. మైక్రోసాఫ్ట్ సిఇఒ సత్య నాదెళ్ల అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు కూడా ఈ సమాచారం ఇచ్చారు. మైక్రోసాఫ్ట్ ఆఫర్కు ట్రంప్ మద్దతు కూడా ఇచ్చారు. 2019 సంవత్సరంలో బైట్డాన్స్ భారతదేశంలో రూ.43.7 కోట్ల వ్యాపారం చేసింది.
Bytedance in talks with India’s Reliance