ఉ.11.30గం.కు
శాసనసభలో తొలిసారి ప్రవేశపెట్టనున్న హరీశ్రావు
బడ్జెట్ పెట్టుబడి 1.57లక్షల కోట్లు?
కేబినెట్ ఆమోదం
మన తెలంగాణ/హైదరాబాద్: ఆర్థిక మాంద్యం, ప్రస్తుతం రాష్ట్ర రాబడిని ఆధారంగా చేసుకుని 2020-21 రాష్ట్ర వార్షిక బడ్జెట్ను ఆదివారం 11.30 గంటలకు అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు ప్రవేశపెట్టనున్నారు. రూ.1.57 లక్షల కోట్ల అంచనాలతో ప్రభుత్వం సిద్ధం చేసిందని తెలిసింది. సిఎం కెసిఆర్ నేతృత్వంలో శనివారం ప్రగతి భవన్లో సమావేశమైన మంత్రివర్గం బడ్జెట్ ప్రతిపాదనలను ఆమోదించింది.
ప్రస్తుతం అమలు చేస్తున్న అన్ని పథకాలను యధాతధంగా అమలు చేస్తూ, స్వీయ ఆదాయ మార్గాలను పెంపొందించుకోవడంపై బడ్జెట్ను పొందుపర్చినట్లు సమాచారం. ఎప్పటిలాగే ప్రధానంగా సాగునీటి ప్రాజెక్టులు, వ్యవసాయం, వైద్యారోగ్యం, సంక్షేమ రంగాలకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. 201920 బడ్జెట్ ప్రతిపాదిత అంచనాలు, వాస్తవిక రాబడులు, ఆర్థిక మాంద్యం, వచ్చే ఏడాది రాబడుల అంచనా, ప్రభుత్వ ప్రాధాన్య రంగాలకు నిధుల కేటాయింపు ప్రాతిపదికన వాస్తవిక బడ్జెట్ను ప్రజల ముందుంచాలని ప్రభుత్వం భావిస్తోంది.
దీనిలో భాగంగానే వృద్ధి రేటు 10 శాతానికి అనుగుణంగా 202021లో రూ.1.57 లక్షల కోట్లు ప్రతిపాదించనున్నట్లు సమాచారం. 201920లో రూ.1.46 లక్షల కోట్లు ప్రతిపాదించారు. అయితే సవరించిన అంచనాలు రూ.1.30 లక్షల కోట్లు వరకు ఉంటుందని ఆర్థిక శాఖ వర్గాలు తెలిపాయి. అలాగే భూముల అమ్మకం ద్వారా రూ.10 వేల కోట్లు ఆదాయం పొందాలని ప్రతిపాదించినప్పటికీ, ప్రభుత్వం విక్రయాలు జరపలేదు. ఈసారి సాగునీటి రంగానికి రూ.9 వేల కోట్ల లోపే బడ్జెట్ కేటాయింపులుంటాయని తెలిసింది. వీటికి అదనంగా అప్పులు కలిపి రూ.21 వేల కోట్ల వరకు ప్రతిపాదనలుండే అవకాశాలున్నాయి. వ్యవసాయ రంగానికి ఏకంగా రూ. 20 వేల కోట్లు కేటాయించనున్నట్లు తెలిసింది. ఇందులో రైతు రుణమాఫీకి రూ.6 వేల కోట్లు, రైతుబంధుకు రూ. 11 వేల కోట్లు, రైతుబీమాకు రూ.840 కోట్లు ప్రతిపాదించినట్లు సమచారం.
అలాగే 57 ఏళ్లకు కుదించిన వయసు ఆధారంగా అర్హులైన కొత్త పింఛన్దారులకు పెన్షన్ కింద రూ.11 వేల కోట్లు, జీతభత్యాలు, సబ్సిడీలు, వడ్డీలకు కలిపి రూ.47 వేల కోట్లు కేటాయింపులు అవసరం అవుతాయి. వీటితో పాటు పట్టణ, పల్లె ప్రగతి కార్యక్రమాలకు రూ.7 వేల కోట్లు, రూ.10 వేల కోట్లు విద్యుత్రాయితీలకు ప్రతిపాదించినట్లు తెలిసింది. అప్పులు, వడ్డీలకు రూ.15 వేల కోట్ల వరకు ప్రతిపాదించనున్నారు. వైద్య రంగానికి కూడా అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నారు. బస్తీ దవాఖానాలు, హెల్త్ ప్రొఫైల్ కోసం నిధుల ప్రతిపాదించారు.
మిగిలిన మొత్తాన్ని ఉపకార వేతనాలు, కల్యాణ లక్ష్మి, విద్య, సంక్షేమం, హోం శాఖలకు కేటాయించేలా బడ్జెట్ రూపొందించినట్లు తెలిసింది. ఈసారి కెసిఆర్ ఆపద్బంధు, కుట్టు మిషన్ల పంపిణీ పథకాలకు మాత్రమే కొత్తగా నిధులుంటాయని సమాచారం. ఇప్పటికే ఆర్థిక మాంద్యం ప్రభావం తెలంగాణ రాష్ట్రంపై కూడా పడిందని ప్రభుత్వం స్పష్టం చేసింది. అదే సమయంలో పటిష్టమైన పరిపాలనా విధానాలతో, కట్టుదిట్టమైన ఆర్థిక క్రమశిక్షణతో తెలంగాణ నిలదొక్కుకోకలిగింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఆర్ధికాంశాలలో కఠినమైన క్రమశిక్షణ పాటిస్తోందని సిఎం స్పష్టం చేసిన విషయం విధితమే.